నాగార్జునసాగర్ డ్యాంపై ఉగ్రవాదుల కన్ను: పటిష్ట నిఘా
డ్యామ్ పరిసర ప్రాంతాల్లో గట్టి బందోబస్తు కొనసాగుతోంది. దిల్సుఖ్ నగర్ బాంబు పేలుళ్ల నేపథ్యంలో ఇంటిలిజెన్స్ వర్గాలు మరోసారి గుంటూరు, నల్గొండ ఎస్పీలను అప్రమత్తం చేశాయి. డ్యామ్కు ఏదైనా ముప్పు వాటిల్లితే పెద్ద సంఖ్యలో ప్రాణ నష్టంతో పాటు తీవ్రమైన ప్రమాదకర పరిస్థితులు ఎదురుకానున్నాయి. ఈ నేపథ్యంలో డ్యామ్ భద్రతపై మరింత అప్రమత్తంగా ఉండాలని ఇంటిలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి.
దీంతో మంగళవారం రూరల్ ఎస్పీ సత్యనారాయణ, నల్గొండ ఎస్పీ నవీన్ గులాటి సంయుక్తంగా నాగార్జున సాగర్ డ్యామ్ను సందర్శించారు. నాగార్జున సాగర్ డ్యామ్ భద్రతపై తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు. ప్రస్తుతం విధుల్లో ఉన్న భద్రతా సిబ్బంది సంఖ్యను ఎంత వరకు పెంచాలనేదానిపై కూడా చర్చించారు. ప్రస్తుతం వంద మంది స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్(ఎస్పిఎఫ్) సాయుధ బలగాలు పహార కాస్తున్నాయి.
భద్రతను మరింత పెంచాలని మంగళవారం నిర్ణయించారు. అదే విధంగా భద్రతాపరంగా ఉన్న లోపాలను కూడా గుర్తించినట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలో ఆయా లోపాలను సరిచేసి భద్రతను కట్టుదిట్టం చేయాలని నిర్ణయించారు. ముఖ్యంగా ప్రస్తుతం ఉన్న పగలు, రాత్రి బైనాక్యూలర్లతో పాటు మరికొన్నింటిని పెంచాలని, సిసి కెమెరాలను పెంచాలని నిర్ణయించారు. విదేశీయులు, పర్యాటకులకు తగిన రక్షణ కల్పించేందుకు నిర్ణయించుకున్నారు. పరిసర ప్రాంతాలపై నిఘా వ్యవస్థను పటిష్టం చేయాలని అభిప్రాయపడ్డారు.