దిల్సుఖ్నగర్ పేలుళ్లు: మరొకరి మృతి, 17చేరిన సంఖ్య
రెండు వారాల పాటు మృత్యువుతో పోరాడిన రవి కుమార్ వయస్సు ఇరవై ఐదు. ఈ పేలుడు ఘటనలో రవి కుమార్ తీవ్రంగా గాయపడ్డాడు. పేలుడు జరిగిన సమయంలో రవి కుమార్ తన స్నేహితుడు తిరుపతితో కలిసి స్నాక్స్ తీసుకుంటున్నాడు. తిరుపతి అదే రోజు మృతి చెందాడు. రవి ఎస్ఐ పోలీసు ఉద్యోగ పరీక్షల నిమిత్తం ప్రిపరేషన్ కోసం వచ్చాడు. దిల్సుఖ్ నగర్లో ఉంటుండేవాడు.
రెండు వారాలుగా రవి కుమార్ వెంటిలెటర్ పైనే ఉన్నాడని డాక్టర్లు తెలిపారు. రవి శరీరంలోకి పదునైన ఊచలు దిగాయని, అవి శరీరంలో కుడి వైపు నుండి వచ్చి ఎడమ వైపుకు బయటకు వచ్చాయని చెప్పారు. వాటిని తీసేసినట్లు చెప్పారు. అతని కాళ్లు, చేతులు కూడా ఫ్రాక్చర్ అయ్యాయని చెప్పారు.
కాగా, గత నెల 21వ తేదిన దిల్సుఖ్ నగర్లోని కోణార్క్ థియేటర్, వెంకటాద్రి థియేటర్ల వద్ద జంట పేలుళ్లు సంభవించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో అక్కడే పదిహేను మంది మృతి చెందగా.. ఆ తర్వాత ఒకరు.. ఈ రోజు మరొకరు మృతి చెందారు. ఈ ఘటనలో మొత్తం 116 మంది వరకు గాయపడ్డారు. వారు నగరంలోని పలు ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు.
శివరాత్రి కోసమే
శివరాత్రి పండుగ సందర్భంగా రాష్ట్రంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు నగర పోలీసు కమిషనర్ అనురాగ్ శర్మ చెప్పారు. బాంబు పేలుళ్ల ఘటనలో సేకరించిన ఆధారాలను ఎన్ఐఏకు అప్పగించనున్నట్లు చెప్పారు. వ్యాపార సంస్థళ సహకారంతో నగరంలో మరో ఆరువందల సిసి కెమెరాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. దేవాలయాలు, జనసమ్మర్ద ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు చేస్తున్నామన్నారు.