అవిశ్వాసంతో వైయస్ జగన్ బెయిల్కు లింక్ ఉందా?
ఈ రెండింటికి ఏమైనా సంబంధం ఉందా? అంటే అవుననే అంటోంది తెలుగుదేశం పార్టీ. వచ్చే నెలలో జగన్ బెయిల్ పిటిషన్ దాఖలు చేస్తారని అందుకే అవిశ్వాసం పెట్టాలని డిమాండ్ చేస్తున్నారని టిడిపి నేత రేవంత్ రెడ్డి విజయవాడలో జరిగిన శాసనసభా పక్ష సమావేశంలో చెప్పినట్లుగా సమాచారం. జగన్ పిటిషన్ దాఖలు చేసే సమయంలో అవిశ్వాసం పెడితే కేంద్రాన్ని బ్లాక్ మెయిల్ చేసి ఆయన బెయిల్ తెచ్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారనేది టిడిపి వాదన.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలు, జగన్ సోదరి షర్మిల అందరూ నిత్యం అవిశ్వాసంపై డిమాండ్ చేయడం వెనుక బ్లాక్ మెయిల్ చేసి బెయిల్ తెచ్చుకునేందుకేని చెబుతున్నారు. తమ వెంట చాలామంది ఉన్నారని చెప్పిన జగన్ గతంలో అవిశ్వాసం పెడితే ఏం చేశారో అందరికీ తెలుసునని అంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో అవిశ్వాసం పెడితే జగన్కు రాజకీయంగా, ఆర్థికంగా లాభించడమే కాకుండా.. ఆయన బయటకు వచ్చేందుకు కూడా ఉపయోగపడుతుందని, అందుకే అవిశ్వాసానికి దూరంగా ఉంటేనే మంచిదని రేవంత్ రెడ్డి సూచించినట్లుగా తెలుస్తోంది.
టిడిపికి 77 ఎమ్మెల్యేల బలం ఉండగా... జగన్ పార్టీకి 17 మంది బలం ఉందని... ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు అది సరిపోదని, పోనీ అవిశ్వాసం పెడితే ఎవరిని తీసుకువస్తారో పరేడ్ చేయమని సవాల్ చేస్తే వారు స్పందించడం లేదని టిడిపి అంటోంది. అలాంటప్పుడు మరోసారి అవిశ్వాసం వీగిపోతుందే తప్ప లాభం లేదంటున్నారు. మద్దతు రాదని తెలిసినా జగన్ పార్టీ సొంత లబ్ది కోసమే టిడిపిని సవాల్ చేసి దోషిగా చూపే ప్రయత్నాలు చేస్తోందని టిడిపి అంటోంది.
అయితే, ఎవరైనా ఇతర పార్టీలు అవిశ్వాసం పెడితే తాము మద్దతిచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని చెబుతున్నారు. సుప్రీం సూచనల మేరకు సిబిఐ ఈ నెలాఖరులోగా కేసు పూర్తి చేయాల్సి ఉంది. కేసు విచారణ పూర్తి కాని పక్షంలో బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకోవచ్చునని జగన్కు సుప్రీం గతంలో సూచించింది. మరోవైపు తమకు నిర్దిష్ట సమయం లేదని, విజయసాయి బయట ఉంటే తుది చార్జీషీట్ కష్టమని సిబిఐ చెబుతున్న విషయం తెలిసిందే.