రాజమండ్రిలో స్టార్స్ ఢీ: వీరిలో టిక్కెట్ ఎవరిదో(పిక్చర్స్)
హైదరాబాద్: వచ్చే సాధారణ ఎన్నికల్లో మరోసారి రాజమండ్రి నియోజకవర్గం రసవత్తరంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2009 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుండి మురళీ మోహన్, ప్రజారాజ్యం పార్టీ నుండి రెబల్ స్టార్ కృష్ణం రాజు, కాంగ్రెసు నుండి ఉండవల్లి అరుణ్ కుమార్లు బరిలోకి దిగారు. మురళీ మోహన్, కృష్ణం రాజులను ఎదుర్కొని ఉండవల్లి ఆ ఎన్నికల్లో గెలిచారు. తదుపరి ఎన్నికల్లోను రాజమండ్రి ఆసక్తికరంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.
టిడిపికి మురళీ మోహన్
తెలుగుదేశం పార్టీ నుండి మరోసారి మురళీ మోహన్ పోటీ చేసేందుకు సమాయత్తమవుతున్నారు. అందుకోసం ఆయన తన నియోజకవర్గంలో ప్రజల ఆదరాభిమానాలు పొందేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. పలు సేవా కార్యక్రమాలను చేపడుతున్నారు. గత ఎన్నికల్లో ఓటమి సానుభూతికి తోడు, కొన్నాళ్లుగా చేస్తున్న సేవా కార్యక్రమాలు మురళీ మోహన్కు వచ్చే ఎన్నికల్లో ఉపయోగపడుతాయని టిడిపి క్యాడర్ భావిస్తోంది. టిడిపి నుండి మురళీ మోహన్ ఇప్పటికే ఉండటంతో అక్కడ ఆ పార్టీ నుండి మరో అభ్యర్థి ఆశలు పెట్టుకోలేదు.
కాంగ్రెస్ నుండి పురంధేశ్వరి?
ఎంపి ఉండవల్లి గత ఎన్నికల్లోనే పోటీకి విముఖత చూపారట. అయితే, దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి ఒప్పించి టిక్కెట్ ఇచ్చారు. ఈసారి కూడా ఆయన విముఖత చూపే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అదే జరిగితే.. విశాఖపట్నం ఎంపీగా ఉన్న దగ్గుపాటి పురంధేశ్వరి కాంగ్రెసు తరఫున బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. పురంధేశ్వరి మొదటి ప్రాధాన్యత విశాఖకే. అయితే, టి.సుబ్బిరామి రెడ్డి అదే నియోజకవర్గానికి పట్టుపడుతున్న తరుణంలో అధిష్టానం ఆయన వైపు మొగ్గు చూపితే పురంధేశ్వరి రాజమండ్రి నుండి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఒకవేళ ఉండవల్లి విముఖత చూపని పక్షంలో ఆయనకే టిక్కెట్ దక్కుతుంది.
జగన్ పార్టీ నుండి ఇద్దరు ఆశావహులు.. కొత్తగా జయప్రద
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నుండి ఇటీవలే టిడిపి నుండి జగన్ వైపుకు వచ్చిన ఎమ్మెల్సీ బొడ్డు భాస్కర రామారావు తన తనయుడు కోసం రాజమండ్రి టిక్కెట్ను ఆశిస్తున్నారు. అప్పటికే బిసి నేత రాజ్కుమార్ ఇదే ప్రయత్నాల్లో ఉన్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంపికైన ఆదిరెడ్డి అప్పారావు కూడా రాజమండ్రి కోసమే వచ్చిన పోటీ తీవ్రంగా ఉండటంతో అధిష్టానం ఆయనను బుజ్జగించి ఎమ్మెల్సీ టిక్కెట్ ఇచ్చింది.
ఇప్పుడు రాజ్ కుమార్, బొడ్డు తనయుడు ఆశిస్తున్నారు. ఈ ఇద్దరు బరిలో ఉండగానే ప్రముఖ సినీ నటి, యుపిలోని రాంపూర్ ఎంపి జయప్రద పేరు కొత్తగా తెరపైకి వచ్చింది. ఆమె జగన్ పార్టీలో చేరేందుకు సిద్ధమైనట్లుగా చెబుతున్నారు. ఆమె రాజమండ్రి నుండి పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. మరోవైపు జయప్రదను బిజెపి ప్రసన్నం చేసుకునే ప్రయత్నాలు చేస్తోంది.
కాంగ్రెసు నుండి ఉండవల్లి, ఆయన విముఖత చూపితే సినీ నేపథ్య కుటుంబం నుండి వచ్చిన పురంధేశ్వరిలు టిడిపి నుండి పోటీ చేయబోయే మురళీ మోహన్, జగన్ పార్టీ లేదా ఇతర పార్టీ నుండి పోటీ చేయబోయే జయప్రదను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మొత్తానికి రానున్న ఎన్నికల్లో రాజమండ్రి నియోజకవర్గం మరోసారి ఆసక్తికరంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.

రాజమండ్రి నుండి పోటీకి ఉండవల్లి అరుణ్ కుమార్ విముఖత చూపకపోతే ఆయనే స్టార్లతో పోటీ పడాల్సి ఉంటుంది.

తెలుగుదేశం పార్టీ నుండి మరోసారి మురళీ మోహన్ బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయి.

ఉండవల్లి నో అంటే పురంధేశ్వరి కాంగ్రెసుకు ఓ ప్రత్యామ్నాయంగా కనిపిస్తోందని ప్రచారం జరుగుతోంది.

జయప్రద రాజమండ్రి నుండి పోటీకి ఆసక్తి కనబరుస్తున్నారు. జగన్ పార్టీ వైపు ఆమె చూస్తున్నట్లుగా కనిపిస్తోంది.

మురళీ మోహన్, కృష్ణం రాజులు గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు.

రాజమండ్రి నుండి పోటీకి కాంగ్రెసు, టిడిపి నుండి పెద్దగా పోటీ లేదనే చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటికే అభ్యర్థులు ఎవరో తెలిసిన నేపథ్యంలో మరొకరు ఆ స్థానంపై ఆశలు పెట్టుకోవడం లేదు. అయితే, జగన్ పార్టీలో అది లేదు. రాజమండ్రి టిక్కెట్ కోసం పలువురు జగన్ వైపుకు వస్తున్నారు. ఇప్పుడున్న ఇద్దరికి తోడు జయప్రద పార్టీలో చేరితో జగన్ టిక్కెట్ ఎవరికిస్తారనే ఆసక్తి అందరిలో కలుగుతోంది.












Click it and Unblock the Notifications