అయోమయం!: బూచేపల్లికి జగన్ నుండి హామీ లేదా?
అద్దంకిలో తొలినుంచి పార్టీ కోసం పని చేస్తున్న సీనియర్ నేత గరటయ్యను కాదని ఇటీవలే పార్టీలోకి వచ్చిన గొట్టిపాటికి పెద్దపీట వేయడం వివాదాస్పదమైంది. గరటయ్య అనుచరులు హైదరాబాదు కేంద్ర కార్యాలయానికి వచ్చి తమ అసంతృప్తిని అధిష్టానం దృష్టికి తీసుకు వచ్చారు. తాజాగా దర్శి శాసనసభ్యుడు బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డిని పార్టీలో చేర్చుకునే అంశంపై అయోమయం నెలకొన్నట్లుగా చెబుతున్నారు.
అక్రమాస్తుల కేసులో అరెస్టై చంచల్ గూడ జైల్లో ఉన్న పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని కలిసేందుకు వస్తారని మొదట భావించారు. అయితే, దర్శి టికెట్ ఇస్తామన్న హామీ లభించకపోవడంతో ఆయన జగన్ను కలవలేదనే ప్రచారం జరుగుతోంది. సర్వేలో ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమైందన్న సాకుతో దర్శి టికెట్ ఇవ్వలేకపోతున్నామని, వేరే నియోజకవర్గం నుంచి టికెట్ ఇప్పించే ప్రయత్నం చేస్తామని ఆ పార్టీ బూచేపల్లికి చెప్పిందట. దర్శి టిక్కెట్ తప్ప మరొకటి వద్దని ఆయన ఖరాఖండిగా చెప్పారట.
ప్రకాశం జిల్లాలో ఇప్పటికే ఆయా నియోజకవర్గాలలో నాయకులు చురుగ్గా పని చేస్తున్నారు. అయితే, పాతవారిని పక్కన బెట్టి కొత్తవారిని చేరదీయడంతో అంతర్గత కలహాలు ప్రారంభమయినట్లుగా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ వైపు చూస్తున్న ఒకరిద్దరు ఎమ్మెల్యేలు ఇప్పుడు వెనుకడుగు వేస్తున్నారట.