నగరి రోజాకు.. కిరణ్, బాబుపై వీరే!: 50 మంది ప్రకటన

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ దాదాపు యాభై నియోజకవర్గాలకు ఇంఛార్జులను ప్రకటించింది. చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం నుండి ప్రముఖ సినీ నటీ, పార్టీ నేత రోజా పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. నగరికి ఆమెను ఇంఛార్జిగా నియమించారు. మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రా రెడ్డి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పైన పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. చింతలను పీలేరు నియోజకవర్గం ఇంఛార్జిగా వేశారు.
మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు నియోజకవర్గమైన కుప్పం ఇంఛార్జిగా సుబ్రహ్మణ్య రెడ్డిని ఎంపిక చేశారు. తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీల నుండి తమ పార్టీలో ఉండి తమ పార్టీలోకి వస్తామని ప్రకటించిన ఎమ్మెల్యేలను కూడా ఆయా నియోజకవర్గాలకు ఇంఛార్జులుగా నియమించింది. పార్టీకి చెందిన ఎమ్మెల్యేల స్థానంలో వారినే నియమించారు. ఒక్క పులివెందులలో మాత్రం పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మను కాకుండా అవినాష్ రెడ్డిని నియమించారు.
విజయమ్మ పార్టీ కార్యకలాపాలు చూసుకుంటున్న దృష్ట్యా జగన్ సోదరుడు అవినాష్ రెడ్డిని నియమించారు. విజయమ్మ సోదరుడు, కడప మాజీ మేయర్ రవీంద్రనాథ్ రెడ్డిని కమలాపురం నియోజకవర్గానికి ఇంఛార్జిగా నియమించారు. దాదాపు యాభై మంది ఇంఛార్జులను పార్టీ గురువారం ప్రకటించింది.












Click it and Unblock the Notifications