పరువు హత్య, కూతురును పొట్టన పెట్టుకున్న తండ్రి
తిమ్మంపేటకు చెందిన మ్యాకల భిక్షపతి మూడో కూతురు పద్మ (20) డిగ్రీ రెండో సంవత్సరం చదువుతోంది. కొంతకాలంగా శ్రావణ్ అనే యువకుడితో ప్రేమలో పడింది. వీరిద్దరివీ వేర్వేరు కులాలు. కూతురు ప్రేమ విషయం తెలిసిన భిక్షపతి మండిపోయాడు. శ్రావణ్ తల్లిదండ్రులను పిలిపించి, తన కూతురు జోలికి రావొద్దని, మీ కుమారుడి పద్ధతి మార్చాలని హెచ్చరించాడు.
తన కూతురు పద్మకు పెళ్లి చేయాలని నిర్ణయించి, 20 రోజుల కిందట ఆమెకు సంబంధం కూడా చూశాడు. అయినా, పద్మ-శ్రావణ్ల ప్రవర్తనలో మార్పు రాకపోవడాన్ని గ్రహించాడు. తన బంధువులను వెంటబెట్టుకొని బుధవారం శ్రావణ్ కుటుంబ సభ్యుల వద్దకు వెళ్లి హెచ్చరించాడు. ఈ సందర్భంలో శ్రావణ్ దురుసుగా మాట్లాడడంతో ఇరువర్గాల మధ్య గొడవ జరిగింది.
దీంతో తన పరువు బజారున పడిందని, దీనికి కూతురే కారణమంటూ భిక్షపతి కోపంతో రగిలిపోయాడు. పద్మను చితకబాదాడు. పట్టరాని ఆవేశంతో ఆమె గొంతు నులిమాడు. దీంతో ఊపిరాడని పద్మ అక్కడికక్కడే మరణించింది. పోలీసులు గురువారం తెల్లవారుజామున గ్రామానికి వచ్చి విచారణ చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పరువు పోతోందన్న ఆవేశంతో తానే చంపానని భిక్షపతి పోలీసుల ముందు అంగీకరించాడు.