ఓటింగ్కు దూరం: అసదుద్దీన్, జగన్ పార్టీకి ప్రశ్న
అవిశ్వాస తీర్మానానికి వైయస్సార్ కాంగ్రెసు బిజెపి మద్దతు ఎలా కోరుతుందని ఆయన అడిగారు. గతంలో తెలుగుదేశం పార్టీ ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానానికి తాము మద్దతు ఇవ్వలేదని ఆయన గుర్తు చేశారు. తమకు రాజకీయ ప్రయోజనం ఉండదు కాబట్టి తెలుగుదేశం ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇవ్వలేదని ఆయన అన్నారు. బిజెపి, తెరాస ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానానికి తాము మద్దతు ఇవ్వబోమని ఆయన స్పష్టం చేశారు.
ప్రధాన ప్రతిపక్షం లేకుండా ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించడం ఇదే తొలిసారి అని ఆయన అన్నారు. తెలంగాణపై తెరాస, బిజెపిలకు భిన్నమైన విధానం తమకు ఉందని ఆయన చెప్పారు. ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని ఆయన విమర్శించారు. శాంతిభద్రతల పరిస్థితి దారుణంగా ఉందని, అమాయకులైన ముస్లిం యువకులను వేధిస్తున్నారని ఆయన విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెసుకు 1994లో పట్టిన గతే పడుతుందని ఆయన అన్నారు. హైదరాబాద్ లోకసభ స్థానం నుంచి కాంగ్రెసు అభ్యర్థిగా అజరుద్దీన్ పోటీ చేస్తే స్వాగతిస్తామని ఆయన చెప్పారు.
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానానికి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ మద్దతు ప్రకటించింది. బిజెపి, సిపిఐ, సిపిఎం తదితర పార్టీలు దానికి మద్దతు తెలిపాయి. ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం తటస్థంగా ఉండాలని నిర్ణయించుకుంది. ఈ స్థితిలో అవిశ్వాస తీర్మానంపై జరిగే ఓటింగుకు దూరంగా ఉండాలని మజ్లీస్ నిర్ణయం తీసుకుంది.