తెరాస పట్టు: అసెంబ్లీ సోమవారానికి వాయిదా
అంతకు ముందు శానససభా అదే కారణంతో రెండు సార్లు వాయిదా పడింది. శనివారం ఉదయం సభ సమావేశం కాగానే స్పీకర్ వాయిదా తీర్మానాలను తిరస్కరించారు. దీంతో ప్రతిపక్షాల సభ్యులు స్పీకర్ పోడియం వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు. దీంతో స్పీకర్ తొలుత సభను గంటపాటు వాయిదా వేశారు.
తిరిగి సమావేశమైన తర్వాత కూడా పరిస్థితిలో మార్పు రాలేదు. దాంతో మరో అర గంట వాయిదా వేశారు. మూడోసారి సభ ప్రారంభమైన తర్వాత కూడా సభ్యులు తమ పట్టు వీడలేదు. దీంతో సోమవారానికి స్పీకర్ సభను వాయిదా వేశారు.
బాబ్లీ ప్రాజెక్టుపై అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తామని ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి చెప్పారు. సమావేశం ఎప్పుడు నిర్వహించేది ఈ రోజే చెప్తామని ఆయన అన్నారు. బాబ్లీ ప్రాజెక్టుపై చర్చకు తెలుగుదేశం పార్టీ సభ్యులు పట్టుబట్టడంతో ఆయన ఆ విషయం చెప్పారు. అయినా తెలుగుదేశం సభ్యులు వినలేదు. ముఖ్యమంత్రితో చర్చించి అఖిలపక్ష సమావేశం తేదీనీ తెలియజేస్తామని ఆనం చెప్పారు.
తెలంగాణ పట్ల కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం నిర్లక్ష్యపూరితంగా వ్యవహరిస్తోందని తెరాస శాసనసభా పక్ష నేత ఈటెల రాజేందర్ అన్నారు. కాంగ్రెసు పార్టీ ఇప్పటికైనా వెకిలి మాటలు ఆపి తెలంగాణలోని సమస్యలు పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వం ముక్కు పిండైనా ప్రాజెక్టులు, నిధులు దక్కించుకుంటామని ఆయన చెప్పారు.