కర్నూల్లో దారుణం: రాజధానిలో దొంగనోట్ల ముఠా అరెస్ట్
నెమళ్ల మృతి
కరీంనగర్ జిల్లా మల్లాపూర్ మండల కేంద్ర శివారులో గల సోమేశ్వర కొండ వద్ద ఆరు నెమళ్లు మృతి చెందాయి. కొండ సమీపంలో గల చెరువులో నీటిని తాగేందుకు వచ్చిన నెమళ్లు చనిపోయి ఉంటాయని స్థానికులు భావిస్తున్నారు. విష ప్రయోగమో లేక పొలాల్లో ఉంచిన క్రిమి సంహారక మందులను తిని ఉండవచ్చునని అనుమానిస్తున్నారు. ఈ విషయాన్ని అటవీ శాఖ అధికారుల దృష్టికి తీసుకు వెళ్లారు.
దొంగ నోట్ల ముఠా అరెస్ట్
దుండిగల్లో దొంగనోట్ల ముఠాని పోలీసులు అరెస్టు చేశారు. నకిలీ నోట్లను చలామణి చేస్తున్న ఎనిమిది మందిని అరెస్టు చేశారు. వారి వద్ద నుండి ఒక స్కానర్ను, ఇరవై ఆరు వేల రూపాయల నకిలీ నోట్లను పోలీసులు సోమవారం స్వాధీనం చేసుకున్నారు.
విద్యార్థి దుర్మరణం
పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం మండలం చింతలకోటి దరవులో విద్యుదాఘాతానికి ఓ విద్యార్థి మృతి చెందాడు. మృతి చెందిన విద్యార్థి తొమ్మిదవ తరగతి చదువుతున్నాడు.