బొత్సకు పిసిసిపైనే మోజు: ముందస్తు పోల్స్పై హింట్
ఇదిలావుంటే, లోకసభకు ముందస్తు ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చునని ఆయన అన్నారు. లోకసభ మధ్యంతర ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని ఆయన పార్టీ నాయకులను, పార్టీ శ్రేణులను కోరారు. పార్టీ జిల్లా, నగర కమిటీ అధ్యక్షులు, సమన్వయకర్తలతో ఆయన శుక్రవారం సమావేశమయ్యారు. ఏప్రిల్ 15వ తేదీలోగా జిల్లా, బ్లాక్, మండల కమిటీలను ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. ప్రస్తుత కమిటీలను ఆయన రద్దు చేశారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్, బడ్జెట్ అంశాలు, వ్యవసాయ కార్యాచరణ ప్రణాళిక, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకుని వెళ్లాలని ఆయన సూచించారు.
విద్యుత్ చార్జీల పెంపుపై, పంటలకు గిట్టుబాటు ధర లేకపోవడంపై ప్రజలు ఆగ్రహంగా ఉన్నారని నాయకులు బొత్సతో అన్నారు. ఈ పరిస్థితిలో ప్రభుత్వ పథకాలపై ప్రజల్లోకి వెళ్లడం ఇబ్బందిగానే ఉంటుందని ఆయన ముందు నాయకులు తమ పరిస్థితిని వెళ్లబోసుకున్నారు.
కాగా, బొత్స సత్యనారాయణకు రెండు నెలలపాటు జోడు పదవుల్లో కొనసాగడానికి పార్టీ అధిష్టానం అనుమతి ఇచ్చినట్లు సమాచారం. రెండు నెలల్లోగా ఆయన మంత్రి పదవిని వదులుకోవచ్చునని చెబుతున్నారు. ఇదే విషయాన్ని బొత్స తనకు చెప్పినట్లు మంత్రి రఘువీరా రెడ్డి గురువారం మీడియా ప్రతినిధులతో అన్నారు. ఎన్నికలు సమీపిస్తున్నందున పిసిసి అధ్యక్షుడికి ప్రాధాన్యం ఎక్కువగా ఉంటుంది.