ఒక్కరికి ఒకే పదవి: బొత్స జాక్పాట్, మినహాయింపు
కాంగ్రెస్ పార్టీలో జోడుపదవులకు స్వస్తి పలకాల్సిన సమయం వచ్చిందని చెబుతున్నారు. ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్గాంధీ తీసుకొచ్చిన కొత్త ప్రతిపాదన మేరకు పార్టీ పదవిలోనో, ప్రజా ప్రతినిధిగానో ఏదో ఒక్కదానిలోనే కొనసాగే వీలుంది. జైపూర్ డిక్లరేషన్లో భాగంగా లోక్సభ ఎంపిలు, ఎమ్మెల్యేలు ఏకకాలంలో రెండు పదవులు నిర్వహించేందుకు వీల్లేదు.
డిసిసి, సిసిసి, పిసిసి అధ్యక్షులుగా ఉన్నవారు ఇకపై ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు అధిష్ఠానం అనుమతించదు. దీంతో పలువురు ఎమ్మెల్యేలు పార్టీ పదవులను వదులుకునేందుకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం బొత్స సత్యనారాయణ పిసిసి అధ్యక్షుడిగా, మంత్రిగా జోడు పదవులు నిర్వహిస్తున్నారు. మంత్రి దానం నాగేందర్ కాంగ్రెసు గ్రేటర్ హైదరాబాద్ కమిటీ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. మరికొందరు ఎమ్మెల్యేలు డిసిసిల అధ్యక్షులుగా ఉన్నారు.
త్వరలోనే వీళ్లు ఏదో ఒకదాన్ని వదులుకోవాల్సి ఉంటుంది. అయితే, పిసిసి అధ్యక్ష పదవిని నిర్వహిస్తున్న బొత్స ఇప్పటికిప్పుడు ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం లేదని అంటున్నారు. ఆయన బాధ్యతలు తీసుకొనేప్పుడు జోడు పదవులు నిర్వహించేందుకు అధిష్ఠానం అంగీకరించింది. కొన్ని ప్రత్యేక పరిస్థితులలో జోడు పదవులు నిర్వహించేందుకు కొందరికి మినహాయింపు ఉంటుందని పార్టీ సంస్థాగత వ్యవహారాలు సమీక్షించే ఆస్కార్ ఫెర్నాండెజ్ పేర్కొన్న సంగతి తెలిసిందే.
అయితే, రెవెన్యూ శాఖ మంత్రి ఎన్.రఘువీరారెడ్డి గురువారం అసెంబ్లీ లాబీల్లో మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ - 'పిసిసి చీఫ్ పదవిలో కొనసాగుతారా, మంత్రి పదవిలో ఉంటారా' అని తాను బొత్సను ప్రశ్నించానని, 'రెండునెలల్లో ఏదో ఒక నిర్ణయం తీసుకుంటాన'ని బొత్స తనతో అన్నారని చెప్పారు.