వేటుకు బాబు ఎఫెక్ట్: వైయస్ జగన్ బలానికి కిరణ్ టెస్ట్!
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తన వస్తున్నా మీకోసం పాదయాత్రను వచ్చే నెల ఇరవయ్యో తేదితో పుల్ స్టాప్ పెట్టేయాలని నిర్ణయించుకున్నారు. చంద్రబాబు తన వ్యూహాంలో భాగంగానే యాత్రను ఆపేయాలనే నిశ్చితాభిప్రాయానికి వచ్చారట. కేంద్రంలో ముందస్తు ఎన్నికలు ఎప్పుడైనా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేంద్రంలో ఎన్నికలు వస్తే అధికార కాంగ్రెసు పార్టీ రాష్ట్రంలోను అదే దారి పట్టే అవకాశాలు ఉన్నాయి.
ఈ నేపథ్యంలో చంద్రబాబు తన పాదయాత్రను ఏప్రిల్ 20న ఆపేసి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టే సాధ్యాసాధ్యాలపై చర్చిస్తున్నారట. ఇప్పటికే పాదయాత్రతో ప్రజల్లోకి టిడిపి బాగా వెళ్లిందని, ముందస్తుకు ముందు అవిశ్వాసం తామే పెడితే మరింత లాభిస్తుందని చంద్రబాబు భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ వ్యూహంలో భాగంగానే ఆయన యాత్రకు పుల్ స్టాప్ పెట్టి 20న హైదరాబాద్ రానున్నారు. ఏప్రిల్లో బడ్జెట్ రెండో సెషన్స్ ప్రారంభమవుతాయి.
చంద్రబాబు ముందస్తు వ్యూహంతో ఆపేస్తున్న పాదయాత్ర అధికార పార్టీకి ఝలక్ ఇచ్చిందంటున్నారు. బాబు వ్యూహం కారణంగా కిరణ్ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్గం కాంగ్రెసు ఎమ్మెల్యేల వేటు విషయంలో మనసు మార్చుకుని ఉంటారంటున్నారు. జగన్ వర్గంపై వేటుకు మొదట కిరణ్ వ్యతిరకంగా, బొత్స అనుకూలంగా ఉన్నారనే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.
అధిష్టానాన్ని బొత్స మెప్పించడంతో పాటు కిరణ్ సైలెంట్గా ఉండడానికి కారణం బాబు వైఖరే అంటున్నారు. ముందు ముందు టిడిపి అవిశ్వాసం పెట్టేందుకు సిద్ధమవుతోంది. ఇలాంటి పరిస్థితిల్లో జగన్ వర్గంపై వేటు వేయకుండా ఉంటే భవిష్యత్తులోను వారి నుండి తిప్పలు తప్పవు. అంతేకాకుండా వారిపై చర్యలు తీసుకోని నేపథ్యంలో మరికొందరు అదే దారిలో వెళ్లినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు.
చర్యలు తీసుకోకుంటే ఏమీ చేయడం లేదన్న అభిప్రాయం అటు ఎమ్మెల్యేల్లో, ఏమీ చేయలేకపోతున్నారన్న అభిప్రాయం ఇటు ప్రజ్లలోకి వెళ్తుంది. అదే సమయంలో టిడిపి ముందు ముందు అవిశ్వాసం పెడితే ఈ తొమ్మిది మంది ఎమ్మెల్యేలకు తోడు మరికొందరు కలిసి బెదిరించే అవకాశాలు లేకపోలేదు. దీంతో దీనికి ఇక్కడితోనే చెక్ చెప్పాలనే బొత్స ఉద్దేశ్యానికి కిరణ్ ఆ తర్వాత వంత పాడి ఉంటారని అంటున్నారు.
అందుకే సాధ్యమైనంత త్వరగా వారిపై వేటు వేయాలని ఆఖరుగా నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. వేటు వేసి ఉప ఎన్నికలకు వెళ్తే అధికార పార్టీ ఎన్నికలకు భయపడటం లేదనే సంకేతాలు కూడా వెళ్తాయని భావిస్తున్నారు. జగన్ కారణంగా కాంగ్రెసు ఉప ఎన్నికలకు భయపడుతోందనే మచ్చను తుడిచి వేసుకునేందుకు వేటు ఉపయోగపడుతుందని అంటున్నారు. మరికొందరు జగన్ హవా తగ్గిందని, ఇంకొందరు జగన్ బలం ఇప్పుడు తెలుస్తుందని అధికార పార్టీ సభ్యులు అభిప్రాయపడుతున్నారట.