హామీ: కదలమంటూ టిడిపి ఎమ్మెల్యేల మొరాయింపు
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు శనివారానికి వాయిదా పడడంతో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ అసెంబ్లీలోనే బైఠాయించి ఆందోళన చేపట్టారు. ప్రభుత్వం దిగిరాకపోతే రాత్రికి కూడా అసెంబ్లీలోనే నిద్రపోతామని వారు హెచ్చరించారు. దీంతో పౌరసరఫరాల శాఖ మంత్రి శ్రీధర్బాబు టీడీపీ నేత ధూళిపాల నరేంద్రకు ఫోన్ చేసి ఆందోళన విరమించాలని, విద్యుత్ సమస్యపై శనివారం చర్చకు అనుమతి ఇస్తామని చెప్పారు.
ఇదిలా ఉండగా, శాసనసభ కార్యదర్శి ద్వారా శాసనసభాపతి నాదెండ్ల మనోహర్ టీడీపీ నేతలకు ఒక సందేశం పంపారు. రేపటి ఎజెండాలో విద్యుత్ సమస్యలపై చర్చ ఉంటుందని, ఆందోళన విరమించమని కోరారు. ఎజెండాలో చేర్చడం ముఖ్యం కాదని, ఎట్టి పరిస్థితుల్లోనైనా చర్చకు హామీ ఇవ్వాలని, అప్పుడే ఆందోళన విరమిస్తామని టీడీపీ ఎమ్మెల్యేలు పయ్యావుల కేశవ్, దూళిపాళ్ల నరేంద్ర స్పష్టం చేశారు.
తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులతో అసెంబ్లీ కార్యదర్శి కూడా మంతనాలు జరిపారు. అయినా దిగిరాకుండా 56 మంది తెలుగుదేశం శానససభ్యులు అసెంబ్లీలోనే బైఠాయించారు. శ్రీధర్ బాబు ఫోన్లో మాట్లాడడం సరి కాదని గాలి ముద్దుకృష్ణమనాయుడు అన్నారు. విద్యుత్ సమస్యపై చర్చిస్తామని హామీ ఇవ్వలేదని, ఎజెండాలో చేరుస్తామని మాత్రమే చెప్పారని ఆయన అన్నారు. ఇదిలావుంటే, అసెంబ్లీ ఆవరణలోకి పెద్ద యెత్తున పోలీసులు చేరుకుంటున్నారు. టిడిపి శాసనసభ్యులను అక్కడి నుంచి తరలించే అవకాశాలున్నట్లు చెబుతున్నారు.