నారా లోకేష్ డైరెక్ట్ రోల్: జగన్ భయంతోనే దీక్షలు
హైదరాబాద్: విద్యుత్ సమస్యలపై హైదరాబాదులోని పాత ఎమ్మెల్యే క్వార్టర్స్లో శాసనసభ్యులు చేస్తున్న దీక్షలను తెలుగుదేశం పార్టీలో ప్రత్యక్ష పాత్ర పోషించేందుకు మార్గంగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి కుమారుడు నారా లోకేష్ ఎంచుకున్నారు. పార్టీలో ఇప్పటి వరకు తెర వెనక పార్టీలో కీలక పాత్ర పోషిస్తూ వస్తున్న ఆయన శుక్రవారం ఎమ్మెల్యేలను పరామర్శించడం ద్వారా ప్రత్యక్ష పాత్రలోకి దిగిపోయారు. దీక్ష చేస్తున్న శాసనసభ్యులను పేరుపేరునా పరామర్సించిన తర్వాత నారా లోకేష్ ప్రభుత్వంపై మండిపడ్డారు. మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
చంద్రబాబు పాదయాత్ర చేస్తున్న నేపథ్యంలో ఆయన స్థానంలో నారా లోకేష్ నాయకత్వ పాత్రను పోషించడానికి ముందుకు వచ్చారనే మాట వినిపిస్తోంది. ఇక లోకేష్ నేరుగానే రాజకీయాల్లో తన పాత్ర నిర్వహిస్తారని అంటున్నారు. దాగుడు మూతలకు స్వస్తి చెప్పాలని ఆయన అనుకుంటున్నట్లు శుక్రవారంనాటి పరిణామాన్ని బట్టి అంచనా వేస్తున్నారు. తెలుగుదేశ పార్టీ శ్రేణులను ముందుకు నడిపించడానికి ఆయన పూర్తి స్థాయిలో సిద్ధపడినట్లే చెబుతున్నారు.
ఇదిలావుంటే, తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు హడావిడిగా విద్యుత్ సమస్యలపై దీక్షకు దిగారనే మాట వినిపిస్తోంది. వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తమ కన్నా ముందు దీక్షలు చేపడుతుందనే భయంతోనే వారు తొందరపడ్డారని అంటున్నారు. విద్యుత్ ఉద్యమంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీకన్నా ముందుండాలనే ఉద్దేశంతోనే దీక్షలు చేపట్టారని అంటున్నారు.
మరోవైపు, వామపక్షాల నేతలు నిరాహార దీక్షలు చేపట్టి విద్యుత్ ఉద్యమానికి నాయకత్వం వహించే పరిస్థితి వచ్చింది. వామపక్షాల ఉద్యమాన్ని తమ వైపు తిప్పుకోవడానికి కూడా శాసనసభ్యుల దీక్షలకు పూనుకున్నట్లు చెబుతున్నారు. విద్యుత్ సమస్యపై శాసనసభలో పోరాడినా ఫలితం లేకపోవడంతో తాము వీధి పోరాటానికి దిగినట్లు తెలుగుదేశం పార్టీ చెబుకుంటోంది.
కాగా, శాసనసభ్యులంతా దీక్షలో కూర్చోకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఎమ్మెల్సీలతో కలిసి 29 మంది దీక్షలో పాల్గొన్నారు. 52 మంది శానససభ్యులు దీక్షలకు దూరంగా ఉన్నారు. సీనియర్ శాసనసభ్యుడు గాలి ముద్దుకృష్ణమ నాయుడే ఈ దీక్షల వ్యూహం రచించినట్లు చెబుతున్నారు. చంద్రబాబు సలహా తీసుకుని ఆయన ఈ దీక్షలకు శ్రీకారం చుట్టారని అంటున్నారు.
రేవంత్ రెడ్డి, పయ్యావుల కేశవ్ వంటి యువ శాసనసభ్యులు దీక్షలకు దూరంగా ఉన్నారు. దీక్షలు చేపట్టాలనే ఆలోచనకు ఓటు వేసిన ఎర్రబెల్లి దయాకర్ రావు పార్టీ పనులు పేరు చెప్పి దూరంగా ఉంటున్నారని అంటున్నారు. మోత్కుపల్లి నర్సింహులు ఆరోగ్య కారణం చూపి దీక్షలకు దూరంగా ఉన్నారని సమాచారం. తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుల దీక్షను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఆరోగ్యాలు క్షీణిస్తే ఆస్పత్రులకు తరలించేందుకు ఏర్పాట్లు చేసినట్లు చెబుతున్నారు. ఇప్పటికే 9 మంది ఆరోగ్యాలు క్షీణించినట్లు తెలుస్తోంది.