తేల్చండి: కోమటిరెడ్డి సోదరులకు జగన్ పార్టీ అల్టిమేటం!
పార్టీలోకి వస్తారో లేదో? వారం రోజుల్లోగా తేల్చాలని ఆదేశాలు జారీ చేశారట. అయితే, వారు మాత్రం మరికొద్ది నెలలు గడువు కోరారట. అక్టోబర్ లేదా నవంబరు వరకు పార్టీలోకి వస్తామని చెప్పారట. ఈలోగా తెలంగాణపై అనుకూల నిర్ణయం వెలువడితే, ఇప్పుడున్న పార్టీలోనే ఉంటామని కూడా జగన్ పార్టీకి చెప్పారట. కాంగ్రెసు తెలంగాణపై నిర్ణయం తీసుకోని పక్షంలో పార్టీలోకి వస్తామని చెప్పారట.
కాంగ్రెసు పార్టీ తెలంగాణపై తేల్చని పక్షంలో సమైక్య రాష్ట్రంలో జగన్ ముఖ్యమంత్రి అయితే మంత్రివర్గంలో చేరవచ్చునని వారు భావిస్తున్నారట. కాగా, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పిఏసి) సోమవారం హైదరాబాద్లో భేటీ అవుతోంది. విద్యుత్ చార్జీల పెంపు, ఇతర అంశాలపై చర్చించడానికి ఈ సమావేశం జరుగుతున్నట్లు పార్టీ కార్యాలయం ఆదివారం తెలిపింది.
మరోవైపు.. వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో పలు నియోజకవర్గాల్లో సమన్వయకర్తల గోల చెలరేగడంతో వరంగల్, ఖమ్మం తదితర జిల్లాల్లో పెండింగులో పెట్టారు. సమన్వయకర్తలు ప్రకటించిన చోటల్లా అసంతృప్తి రాజుకుంది.