పార్టీపై 30వరకు జయప్రద సస్పెన్స్: సిద్ధార్థ వస్తాడు
బుధవారం ఆమె తన 52వ జన్మదిన వేడుక జరుపుకోనున్నారు. ఈ సందర్భంగా తిరుమలేశుని దర్శనార్థం తిరుమలకు వచ్చిన ఆమె, మంగళవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. దాదాపు పదేళ్ల తరువాత ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి వస్తున్నట్లు చెప్పారు. మరో ఐదేళ్లు తెలుగు ప్రజలకు సేవ చేయాలని భావిస్తున్నట్లు చెప్పారు.
సెక్యులర్ విధానాలకు కట్టుబడటంతోపాటు ప్రజల సమస్యలను పట్టించుకునే పార్టీలోనే చేరాలని అనుకుంటున్నట్లు వెల్లడించారు. తన వారసుడు సిద్ధార్థను త్వరలో సినీరంగ ప్రవేశం చేయించబోతున్నట్లు ఆమె తెలిపారు. బాలీవుడ్ నటుడు సంజయదత్ మళ్లీ జైలు జీవితం అనుభవించాల్సి రావడం బాధాకరమని అన్నారు. జయప్రద బుధవారం తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) మాజీ చైర్మన్ డీకే ఆదికేశవులు విశ్రాంతి భవనంలో తన జన్మదిన వేడుకలను జరుపుకోనున్నారు.
జయప్రద ఉత్తరప్రదేశ్లో రాంపూర్ నుంచి లోకసభకు ఎన్నికయ్యారు. అయితే, తనను సమాజ్వాదీ పార్టీ నుంచి బహిష్కరించడంతో తిరిగి రాష్ట్ర రాజకీయాల్లోకి అడుగు పెట్టాలని భావిస్తున్నారు. చాలా కాలంగా తాను ఏ పార్టీలో చేరేది చెప్పడం లేదు. ఈ విషయంపై ఊహాగానాలు చెలరేగుతూనే ఉన్నాయి.