ఫొటోలు: జగన్ కోసం షర్మిల, విజయమ్మ ఇలా..
హైదరాబాద్: అక్రమాస్తుల కేసులో జైలు పాలైన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ కోసం తల్లి వైయస్ విజయమ్మ, షర్మిల వీధుల్లోకి వచ్చారు. జగన్ సోదరి షర్మిల చెమటోడుస్తూ పాదయాత్ర చేస్తున్నారు. ఆమె ప్రస్తుతం కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తున్నారు. కడప జిల్లా ఇడుపులపాయ నుంచి ఆమె పాదయాత్ర ప్రారంభమైంది. జగనన్న వస్తాడు, రాజన్న రాజ్యం తెస్తాడంటూ ఆమె ప్రజలకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అదే సమయంలో తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీలు కుమ్మక్కయి జగన్ను జైలులో పెట్టించారని ఆరోపిస్తున్నారు.
కాగా, వైయస్ విజయమ్మ పార్టీ వ్యవహారాలను చూసుకుంటూ ఆందోళనకార్యక్రమాలు చేస్తున్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో వైయస్ విజయమ్మ రాజకీయాల్లో వేలు పెట్టిన సందర్భాలు లేవనే చెప్పాలి. ఆమె తెర వెనకే ఉండిపోయారు. వైయస్ మరణం తర్వాత వైయస్ జగన్ రాజకీయ కార్యకలాపాలతో ఆమె బయటకు వచ్చారు. తన కుమారుడు వైయస్ జగన్ ఓదార్పు యాత్రకు అనుమతి ఇవ్వాలని కోరడానికి కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీని కలవడం దగ్గర నుంచి ప్రస్తుతం విద్యుత్ చార్జీల పెంపుపై దీక్షకు దిగడం వరకు ఆమె రాజకీయాల్లో చురుగ్గా వ్యవహరిస్తున్నారు.
వైయస్ జగన్ కోసం ఆమె అనివార్యంగా రాజకీయాల్లోకి వచ్చారు. జగన్ తప్పకుండా జైలు నుంచి బయటకు వస్తారని ఆమె ప్రజలకు నచ్చజెపుతూ వస్తున్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి ప్రభుత్వ హయాంలోని వ్యవహారాలపై ఆమె ఎప్పటికప్పుడు విమర్శలు చేస్తూ వస్తున్నారు. శాసనసభలో కూడా ఆమె తన ప్రసంగాలను వినిపిస్తున్నారు.
వైయస్ జగన్ తల్లి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ తన కుమారుడి కోసం రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఆమె ప్రజా సమస్యలపై ఆందోళనా కార్యక్రమాలకు దిగుతున్నారు. తాజాగా విద్యుత్ చార్జీలపై పెంపును నిరసిస్తూ నిరాహార దీక్ష చేయడానికి ముందు ఓ మీడియా ప్రతినిధుతో మాట్లాడుతున్న విజయమ్మ.
విద్యుత్ చార్జీల పెంపును నిరసిస్తూ నిరాహార దీక్ష చేపట్టి, ప్రసంగిస్తున్న వైయస్ విజయమ్మ. ఆమెకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యులు అండదండగా నిలుస్తున్నారు.
జగనన్న కోసం షర్మిల పాదయాత్ర చేపట్టారు. ఇడుపుల పాయ నుంచి ప్రారంభమైన ఆమె పాదయాత్ర కృష్ణా జిల్లాకు చేరుకుంది.
వైయస్ జగనన్న వస్తాడని, రాజన్న తెస్తాడని ప్రజలకు షర్మిల హామీ ఇస్తూనే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడిపై ఆమె విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ఉప ఎన్నికల ద్వారా ప్రజల ముందుకు వచ్చిన ఆమె ప్రజల్లోనే ఉంటూ ఇలా ప్రసంగాలు చేస్తున్నారు.
తన పాదయాత్రలో పిల్లలను, పెద్దలను పలకరిస్తూ వారి సమస్యలను వింటూ షర్మిల ప్రజల మనసుదును దోచుకునే ప్రయత్నం చేస్తున్నారు.
వివిధ విషయాలపై ఆమె అవగాహన కల్పించుకుంటూనే ప్రసంగాలకు మెరుగుపెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అప్పుడప్పుడు తడుముకుంటున్నారు కూడా. తాజాగా, ఆమె విద్యుత్తు చార్జీల పెంపుపై న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్లో నిరాహార దీక్షకు దిగారు. కుమారుడి రాజకీయ భవిష్యత్తు కోసం ఆమె రాజకీయాల్లో తల పెట్టారు. జగన్ మళ్లీ ప్రజల్లోకి వస్తాడని, ప్రజల్లో ఉండకుండా చేయడానికే తన కుమారుడిని జైల్లో పెట్టించారని ఆమె అంటున్నారు. వైయస్ జగన్ను ముఖ్యమంత్రిని చేయడమే ధ్యేయంగా తల్లికూతుళ్లు రాకీయాల్లోకి అడుగు పెట్టారు.