టిఆర్ఎస్కు కెవిపితో సంబంధాలు: యాష్కీ సంచలనం
ఎన్నికలకు సంవత్సరం ముందు కలలు కంటే తెలంగాణ రాదని ఆయన వ్యాఖ్యానించారు. బలం పెరుగుతుందే కానీ ప్రత్యేక రాష్ట్రం రాదన్నారు. కెవిపి, రేణుకా చౌదరిలాంటి వారి వల్ల తెలంగాణ పైన నిర్ణయం వాయిదా పడిందే తప్ప రాష్ట్ర ఏర్పాటు మాత్రం ఖాయమన్నారు. అధిష్టానం తెలంగాణకు అనుకూలంగా ఉందన్నారు. కెవిపితో తెరాసతో సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు. ఆంధ్రా నేతలతో కుమ్మక్కై తనను ఓడించాలని చూస్తున్నారన్నారు.
తన ప్రత్యర్థి ఎవరైనా తాను భయపడే ప్రసక్తి లేదన్నారు. ఏడాది ముందే అస్త్ర సన్యాసం చేసి ఎన్నికల కలలు కనడం సరికాదన్నారు. అలా చేయడం వల్ల బలం ఆ పార్టీ బలం మాత్రమే పెరుగుతుందని కెసిఆర్ను ఉద్దేశించి అన్నారు. తెలంగాణ కోసం పోరాడుతున్న తాను గెలువవద్దని ఆంధ్రా నేతలతో కుమ్మక్కవడం శోచనీయమన్నారు. అయినా తాను వెనక్కి పోయే ప్రసక్తి లేదన్నారు.
కెవిపి తీరు వైయస్సార్ కాంగ్రెసు పార్టీని బలోపేతం చేసే విధంగా ఉందన్నారు. తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి, ఇతర ప్రజా సంఘాలు ప్రతి అంశాన్ని గుర్తించాలని కోరారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అమాయకంగా జగన్ వైపు వెళ్లే ఎమ్మెల్యేలకు వందల కోట్ల పనులు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. పార్టీ మారే గ్రేటర్ ఎమ్మెల్యేల జాబితాను తాను అధిష్టానానికి ఇచ్చానని చెప్పారు.