లక్షలు మోసం, మహిళా ప్రైవేట్ డిటెక్టివ్ అరెస్టు
హైదరాబాదులోని బాలానగర్లోని ఐడిపియల్ వద్ద పల్లవి రెడ్డి సాల్వింగ్ ఇన్నోవేటివ్ ప్రాబ్లమ్స్ పేర ఓ ప్రైవేట్ డిటెక్టివ్ ఏజెన్సీని నడుపుతోంది. పల్లవి రెడ్డి తనను మోసం చేసిందంటూ ఓ వివాహిత మహిళ మార్చి 29వ తేదీన హైదరాబాదులోని నారాయణగుడా పోలీసులకు ఫిర్యాదు చేసింది.
తన భర్త, తన అత్తవారి సమాచారం కావాలంటూ గృహిణి మార్చి మొదటి వారంలో పల్లవి రెడ్డిని సప్రదించింది. అందుకు పల్లవి రెడ్డి లక్ష రూపాయలు డిమాండ్ చేసింది. తన వద్ద తగిన నగదు లేకపోవడంతో గృహిణి ఆమెకు బంగారు ఆభరణాలు ఇస్తానని చెప్పింది. అలా ఒక నెలలో పల్లవి వివాహిత నుంచి 55.5 తులాల బంగారం తీసుకుంది.
నెల గడిచినా తాను అడిగిన సమచారాం ఇవ్వకపోవడంతో అనుమానం వచ్చి పల్లవిపై మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పల్లవిరెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పల్లవిరెడ్డిని పోలీసులు మంగళవారం ఆమె నివాసంలో అరెస్టు చేసి ఆమె నుంచి 16.4 లక్షల రూపాయల విలువ చేసే 55.5 తులాల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.
పల్లవి రెడ్డి నడుపుతున్న డిటెక్టివ్ ఏజెన్సీకి లైసెన్సు లేదని పోలీసులు గుర్తించారు. శిక్షణ పొందిన సిబ్బంది కూడా లేరని, ఆ రకంగా డిటెక్టివ్ ఏజెన్సీ పేరు మీద మోసం చేస్తున్నారని పోలీసులు అంటున్నారు.