అందరికి జగనే టార్గెట్: విజయమ్మ, పెద్దిరెడ్డి ఎద్దేవా
హైదరాబాద్: తన తనయుడు, పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి అందరికీ లక్ష్యంగా మారారాని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు, పులివెందుల శాసనసభ్యురాలు వైయస్ విజయమ్మ గురువారం ఉదయం అన్నారు. న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్లో విజయమ్మ ఆధ్వర్యంలో ఆ పార్టీ ఎమ్మెల్యేల నిరాహార దీక్ష నేడు మూడో రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా విజయమ్మ మాట్లాడారు.
విద్యుత్ ఛార్జీలు పెంచుతూ తీసుకున్న నిర్ణయాన్ని ఈ రోజు జరిగే సమీక్షా సమావేశంలో ఉపసంహరించుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించే వరకు దీక్ష విరమించేది లేదన్నారు. ఛార్జీల పెంపు ఏకపక్, నిర్ణయమని కాంగ్రెసు నేతలే విమర్శిస్తున్నారన్నారు. ప్రజలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తే వారే ప్రభుత్వానికి బుద్ధి చెబుతారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రజల పైన రూ.6,500 కోట్ల భారం తగ్గించాలన్నారు.
మరోవైపు దీక్ష చేస్తున్న నేతలకు వైద్య పరీక్షలు నిర్వహించారు. దీక్ష చేస్తున్న ఎమ్మెల్యేల ఆరోగ్యం క్షీణిస్తోంది. శోభా నాగిరెడ్డి, అమర్నాథ్ రెడ్డిలకు వైద్యం అందించాలని సూచించారు. జూపూడి ప్రభాకర రావుకు బిపి లెవల్స్ తగ్గాయి.
కిరణ్, బాబు కలిసికట్టుగా... పెద్దిరెడ్డి
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కలిసి కట్టుగా పని చేస్తున్నారని పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి ఎద్దేవా చేశారు. దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి పథకాలను కిరణ్ గాలికి వదిలేశారన్నారు. తమ జిల్లాలో సహకార, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగిలిందన్నారు.
విద్యుత్ ఛార్జీల తగ్గించకుంటే... కిషన్ రెడ్డి
పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించే వరకు ఊరుకునే ప్రసక్తి లేదని భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి గురువారం హెచ్చరించారు. విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ ఈ నెల 9న రాష్ట్ర బందుకు పిలుపునిస్తున్నట్లు బిజెపి ప్రకటించింది. అకాల వర్షాల కారణంగా నష్టపోయిన పంటకు నష్టపరిహారం చెల్లించాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు.
మాకేదీ నష్టపరిహారం... హరీష్ రావు
రెండేళ్ల క్రితం ఆంధ్రా ప్రాంతంలో నీలం తుఫాను ప్రభావంతో పంట నష్టం జరిగినప్పుడు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి హెలికాప్టర్లో వెళ్లి చూశారని, ఇప్పుడు తెలంగాణలో వడగళ్ల వానకు పంట నష్టం జరిగితే ఎందుకు రాలేదని సిద్దిపేట తెరాస ఎమ్మెల్యే హరీష్ రావు ప్రశ్నించారు. ఆంధ్రా ప్రాంతంలో నష్టపోయిన రైతులకు సహాయం చేయడంలో తప్పులేదని కానీ, తెలంగాణ నేతలకు ఎందుకు సహాయం చేయడం లేదని ఆయన ప్రశ్నించారు. దీనిపై తెలంగాణ మంత్రులు ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు.