మేలోనే ముందస్తు ఎన్నికలు, పవర్ డ్రామాలు: కెసిఆర్
రానున్న ఎన్నికలలో తెరాస ఏ ఒక్క రాజకీయ పార్టీతో పొత్తు పెట్టుకోకుండా ఒంటరిగా పోటీ చేయడమే కాకుండా కేంద్రంలో, రాష్ట్రంలో ఏర్పడే సంకీర్ణ ప్రభుత్వాలలో కీలక పాత్ర పోషించనుందని అన్నారు. ఈ ఎన్నికలలో తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు, కాంగ్రెస్ పార్టీలకు బుద్ధి చెప్పి, అన్ని స్థానాలలో తెరాసను గెలిపించాలని కెసిఆర్ ప్రజలకు పిలుపునిచ్చారు.
రాష్ట్రంలో తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలు కరెంటు పేరుతో పోటాపోటీగా చేస్తున్న దీక్షలు కేవలం అధికారం కోసమేనని ఆయన విమర్శించారు. ఈ దీక్షలు రైతుల కరెంటు కోసం కాదని, పవర్ కోసం చేస్తున్న డ్రామాలని ఆయన వ్యాఖ్యానించారు. శాసనసభ సాక్షిగా ముఖ్యమంత్రి తెలంగాణ అభివృద్ధికి రూపాయి కూడా ఇచ్చే ప్రసక్తే లేదని చెబుతుంటే ఈ ప్రాంత కాంగ్రెస్ ఎంపిలు, ఎమ్మెల్యేలు, మంత్రులు నోరుమూసుకుని కూర్చోవడం వారి దద్దమ్మతనానికి నిదర్శనమని ఆయన అన్నారు. వీరంతా ఎడ్లతో సమానమని ఆయన వ్యాఖ్యానించారు.
తెలంగాణ ప్రాంతంలో వడగళ్ల వాన కురిసి పంటలు దెబ్బతిని రైతులు నష్టపోతుంటే ముఖ్యమంత్రి ఎందుకు పరామర్శించడం లేదని కెసిఆర్ ప్రశ్నించారు. ప్రస్తుతం రాష్ట్రం అంతా సీమాంధ్రుల చేతిలోనే ఉందని, ముఖ్యమంత్రి, పిసిసి, స్పీకర్ పదవులన్నీ ఆంధ్రా ప్రాంతం వారికి కేటాయిస్తూ తెలంగాణ పట్ల కాంగ్రెస్ వివక్ష చూపుతోందని విమర్శించారు. ఈ సభలో తెరాస ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్రెడ్డి, ఏనుగు రవీందర్రెడ్డి, గంపగోవర్ధన్, ఎమ్మెల్సీ స్వామిగౌడ్ తదితరులు పాల్గొన్నారు.