ఆ రెండే మార్గాల్లో...: టిడిపిపై 'కమ్మ'గా వైయస్ జగన్!
2014లో తిరిగి కాంగ్రెసు అధికారంలోకి వస్తుందనే ఆశలు కాంగ్రెసు పార్టీ నేతల్లో చాలామందికి లేదని చెప్పవచ్చు. అందుకే పలువురు ఎమ్మెల్యేలు గోడ దూకుతున్నారు. ప్రధాన ప్రతిపక్షం టిడిపి ప్రజల్లోకి జోరుగా వెళ్తోంది. కాంగ్రెసు ప్రభావం లేకపోవడంతో ఇక టిడిపిని జగన్ ప్రధానంగా లక్ష్యంగా చేసుకొని ఉంటారని అంటున్నారు. టిడిపిపై దెబ్బతీసేందుకు ఆయన గందరగోళపర్చడం, గాలం వేయడం అనే వ్యూహాలతో ముందుకు వెళ్తున్నట్లుగా చెబుతున్నారు.
వరుసగా రెండుసార్లు పరాజయం పాలైన టిడిపి మూడోసారి కూడా అధికారంలోకి వచ్చే ఆస్కారం లేదనే అభిప్రాయాన్ని ఆయా పార్టీ నేతల్లో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కల్పించి వారిని తమ వైపుకు వచ్చేలా చేస్తోందంటున్నారు. తమ వైపుకు రప్పించుకునేందుకు డబ్బులు కూడా ఎరవేస్తున్నారని తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తోంది. జగన్ అధికారంలోకి వస్తే పదవులు మాత్రం ఖచ్చితంగా ఉంటాయని చెబుతున్నారట. పదవులు, డబ్బుల ఆశను చూపి జగన్ వల వేస్తున్నారని ఆరోపిస్తున్నారు.
మరోవైపు టిడిపిని గందరగోళపర్చడం ద్వారా వారి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయవచ్చునని భావిస్తున్నారంటున్నారు. ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ ఫోటోలను, నిన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు ఫోటోను వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఫ్లెక్సీలపై పెట్టడం వెనుక గందరగోళపర్చే ఉద్దేశ్యమే అంటున్నారు. ఇది టిడిపికి నష్టపర్చగా తమకు లాభిస్తుందని ఆ పార్టీ భావిస్తుందని, అందువల్లే ఇలా చేస్తోందంటున్నారు.
అంతేకాకుండా జూనియర్ ఎన్టీఆర్, ఎన్టీఆర్ ఫోటోలను పెట్టడం ద్వారా ఆయా జిల్లాల్లో బలంగా ఉన్న కమ్మ సామాజిక వర్గానికి వల వేసి ఓట్లు కొల్లగొట్టాలని చూస్తున్నట్లుగా కనిపిస్తోంది. కమ్మ సామాజికవర్గం మొదటి నుండి టిడిపికి అండగా నిలుస్తోంది. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కమ్మ నేతలను ఆకర్షించడంతో పాటు వారి ఫోటోలతో కమ్మ సామాజిక వర్గ ఓట్లను కొల్లగొట్టాలని చూస్తోంది. ఆ సామాజికవర్గంపై నెమ్మదిగా జగన్ పార్టీ వల విసురుతోందనే చెప్పవచ్చు.