జూ.ఎన్టీఆర్పై అశలు వద్దు: ఎన్టీఆర్ ఫ్లెక్సీపై రేవంత్ ఫైర్
వైయస్ జగన్ పార్టీ నాయకులకు దావూద్ ఇబ్రహీం, ఈడి అమీన్, ముషార్రఫ్లు సమ ఉజ్జీలని, వారి ఫొటోలు పెట్టుకోవాలని ఆయన అన్నారు. తమ పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు ఫొటోలను సిగ్గు ఉంటే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు ఫ్లెక్సీల నుంచి తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. ఓ పార్టీ వ్యవస్థాపకుడి ఫొటోను వేరే పార్టీ ఎలా వాడుకుంటుందని ఆయన అడిగారు. చిల్లర దొంగల ఫొటోలను వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పెట్టుకుంటే తమకు అభ్యంతరం లేదని ఆయన అన్నారు.
తాము వైయస్ రాజశేఖర రెడ్డి ఆశసాధన కోసం పనిచేయడం లేదని, ఎన్టీఆర్ ఆశయ సాధన కోసం పనిచేస్తున్నామని చెప్పాలని ఆయన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులను డిమాండ్ చేశారు. నియంతలు, జేబు దొంగల ఫొటోలు పెట్టుకోవాలని ఆయన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులకు సూచించారు. ఎన్టీఆర్ ఫొటోలు పెట్టుకుంటే ప్రజలు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులను క్షమించరని ఆయన అన్నారు.
వైయస్ రాజశేఖర రెడ్డి అవినీతి గురించి చెప్తే ఆ ప్రభుత్వ హయాంలో విడుదలైన జీవోలు బండ్లు నిండుతాయని ఆయన అన్నారు. గురుకుల ట్రస్టు భవన్ భూముల ఆక్రమణ గురించి తాము చెప్పామని ఆయన అన్నారు. అన్నపూర్ణ స్టూడియోలో వాణిజ్య కార్యకలాపాలకు అనుమతి ఇవ్వడంపై, జంతు సంరక్షణ పేరుతో నాగార్జున భార్య అమల భూకబ్జా గురించి తాము మాట్లాడుకుంటూ వస్తున్నామని ఆయన చెప్పారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీని నమ్ముకుంటే ఎన్నికల తర్వాత పురుగుల మందే గతి అని ఆయన వ్యాఖ్యానించారు.
కుర్చీపై కక్కుర్తి కోసం వైయస్ రాజశేఖర రెడ్డి బద్ధ శత్రువులను జగన్ చేరదీస్తున్నాడని ఆయన వ్యాఖ్యానించారు. రాజన్న రాజ్యం, జగనన్న బాణం అని షర్మిల చెబుతూ ఎన్టీఆర్ ఫొటోలను వాడడం సరి కాదని ఆయన అన్నారు.