వైయస్.. ఎన్టీఆర్, అద్దె నేతల పార్టీ!: దేన్నీవదలని జగన్
హైదరాబాద్: వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేందుకు పనికి వస్తుందనుకునే ఏ అంశాన్ని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వదలడం లేదు! కాంగ్రెసు పార్టీ పథకాలు మొదలు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ నందమూరి తారక రామారావు వరకు ప్రతి అంశాన్ని తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నాలు జగన్ చేస్తున్నారు.
జగన్ తీరుపై కాంగ్రెసు, టిడిపిలు స్పందిస్తూ... నాయకుడు లేని పార్టీ అని, అందుకే కాంగ్రెసు నేత అయిన వైయస్ రాజశేఖర రెడ్డిని, టిడిపి నేత అయిన నందమూరి తారక రామారావు ఫోటోలను వినియోగించుకుంటున్నారని ఎద్దేవా చేస్తున్నారు. వైయస్, ఎన్టీఆర్ ఫోటోలను ఉపయోగించుకోవడం ద్వారానే ఆ పార్టీకి ఓ దిశ, నిర్దేశనం, నైతిక సిద్ధాంతాలు లేవని తెలుస్తోందని ప్రత్యర్థి పార్టీలు విమర్శిస్తున్నాయి. ఇతర నాయకులను వినియోగించుకునే పార్టీలాగా జగన్ పార్టీ తయారయిందంటున్నారు. ఒక విధంగా ఓట్లు కొల్గగొట్టేందుకు ఇతర పార్టీల నేతలను వినియోగించడమంటే వారిని బలవంతంగా తమ వారుగా చెప్పుకునే ప్రయత్నాలు చేస్తున్నట్లే అంటున్నారు.

మొదట వైయస్, పథకాలు
కాంగ్రెసును వీడి కొత్త కుంపటి పెట్టుకున్న అనంతరం జగన్ మరణించేంత వరకు కాంగ్రెసు పార్టీ నేతగా, ముఖ్యమంత్రిగా ఉన్న వైయస్ రాజశేఖర రెడ్డిని, ఆయన ప్రవేశ పెట్టిన పథకాలను తనకు అనుకూలంగా మార్చుకున్నారు. వైయస్ హయాంలో ప్రవేశ పెట్టిన పథకాలు ఆయనవేనని, పార్టీవే అయితే మిగతా రాష్ట్రాల్లో ఎందుకు ప్రవేశ పెట్టలేదని జగన్ పార్టీ లాజిక్ లాగింది. వైయస్ హయాంలో రాష్ట్రంలో ప్రవేశ పెట్టిన పథకాలు, ఆయన బొమ్మతోనే ఆ పార్టీ జెండా ఉంది.
వైయస్ పథకాలు కాంగ్రెసు పార్టీ పథకాలు కాదని, అదే నిజమైతే ఇప్పుడు ఎందుకు వాటిని నీరుగార్చుతున్నారని జగన్ పార్టీ ప్రశ్నిస్తోంది. దీనిని బలంగా ఆ పార్టీ ప్రజల్లోకి తీసుకు వెళ్లింది.. వెళ్తోంది. ప్రజల్లో కూడా పథకాలు వైయస్విగానే ఎక్కువగా ముద్రపడ్డాయి. అదే సమయంలో కాంగ్రెసు పార్టీ మాత్రం వైయస్ తమ పార్టీ నేత అని, పథకాలు కొనసాగుతున్నాయని చెబుతోంది. వైయస్ విషయంలో ఏమీ తేల్చుకోని పరిస్థితుల్లో కాంగ్రెసు ఉంది. వైయస్ వల్ల జగన్కే లాభం చేకూరే స్థాయికి ప్రజల్లోకి వెళ్లింది. దీంతో వైయస్ విషయంలో కాంగ్రెసు తర్జన భర్జన పడుతోంది.
వైయస్ తర్వాత జగన్ పార్టీ టిడిపిని టార్గెట్ చేసుకుంది. జూనియర్ ఎన్టీఆర్ ఫోటోలు తమ ఫ్లెక్సీలో పెట్టి టిడిపిలో పెద్ద రగడనే జగన్ పార్టీ సృష్టించింది. జూనియర్ విషయాన్ని పక్కన పెడితే రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పును తీసుకు వచ్చిన టిడిపి వ్యవస్థాపకులు ఎన్టీఆర్ ఫోటో పెట్టుకోవడానికి కూడా జగన్ వెక్కి పోవడం లేదంటున్నారు. తన తండ్రి అయినప్పటికీ చివరి వరకు కాంగ్రెసు నేతగా ఉన్న వైయస్ ఫోటోను ఉపయోగించుకున్న జగన్.. ఇప్పుడు కమ్మ ఓట్లను, టిడిపిని గందరగోళపర్చేందుకు ఎన్టీఆర్ ఫోటోను ఉపయోగించుకుంటున్నారని అంటున్నారు.
జగన్ తీరు చూస్తుంటే అధికారంలోకి వచ్చేందుకు ఏ అంశాన్ని వదలుకోవడం లేదంటున్నారు. గతంలో ఎన్టీఆర్ బొమ్మకు ఓదార్పు సమయంలో జగన్ నమస్కారం చేశారు. ఇప్పుడు పార్టీ ఆ బొమ్మను వినియోగించుకుంటున్నట్లుగా కనిపిస్తోంది. వైయస్ ఫోటో అయినా, ఎన్టీఆర్ ఫోటో అయినా, జూనియర్ ఎన్టీఆర్ ఫోటో అయినా జగన్ రాజకీయ వ్యూహంలో భాగమే అంటున్నారు. వైయస్ ఫోటోతో పాటు ఎన్టీఆర్ ఫోటోను జగన్ పార్టీ వినియోగించుకోవడమంటే తప్పులో కాలేసినట్లే అంటున్నారు. అయితే, మంచి ఆదరణ కలిగిన ఇద్దరు నేతలను ఉపయోగించుకోవడం ద్వారా లబ్ధి పొందాలని జగన్ చూస్తున్నారనే చెప్పవచ్చు.












Click it and Unblock the Notifications