పెళ్లి, ప్రధాని పదవి అర్థంలేని ప్రశ్నలు: రాహుల్ గాంధీ
భారత్ శక్తివంతమైన దేశమని, దేశంలో ఎన్నో సహజవనరులు ఉన్నాయని ఆయన అన్నారు. భారత్లో ఉన్నన్ని సహజవనరులు ఎక్కడా లేవన్నారు. అలాగే దేశంలో మేధావులకు, నిపుణులకు ఏమాత్రం కొదువ లేదన్నారు. కొన్నేళ్లుగా భారత్ పారిశ్రామికరంగంలో దూసుకుపోతోందన్నారు.
దేశ అభివృద్ధికి రోడ్లు, రవాణా, విద్యుత్ చాలాకీలకం అన్నారు. విద్యా వ్యవస్థలో మరిన్ని సంస్కరణలు చేస్తామని చెప్పారు. భారత దేశ అభివృద్ధిలో పారిశ్రామికవేత్తల కృషి అభినందనీయమన్నారు. పేద ప్రజలకు సమాజంలో ఏమాత్రం గుర్తింపు లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
యుపిఏ పాలనలో దేశం చాలా అభివృద్ధి చెందిందని చెప్పారు. నిరుద్యోగం, ఉపాధి కల్పించేందుకు యూపిఏ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. కార్పోరేట్ కంపెనీల కారణంగా దేశ స్వరూపమే మారిపోయిందని చెప్పారు. మౌలికాసదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత పారిశ్రామిక రంగంపైనే ఉందని ఆయన అన్నారు.
మన విద్యార్థుల చదువు కొంత నిరర్థకంగా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. అందుకే విద్యా వ్యవస్థలో మార్పు తీసుకు రావాల్సిన అవసరముందన్నారు. ఎన్ని అధికారాలు ఉన్నప్పటికీ ఒక వ్యక్తి వ్యవస్తను మార్చలేడన్నారు. అందరూ సహకరించాలన్నారు. భారతీయులు నిరాశావాదులు, నిస్పృహావాదులు కాదన్నారు. ఆశావహులు అన్నారు.
మన పారిశ్రామికవేత్తల వల్లనే భారత్కు విదేశాల్లో గౌరవం పెరిగిందన్నారు. మానవవనరులే మన సంపద అన్నారు. గత ఐదేళ్లలో కార్పోరేట్ రంగం కష్టపడి పని చేసిందన్నారు. ప్రపంచ స్థాయి విద్య మన పిల్లలకు అందించాలన్నారు. తన పెళ్లి, తాను ప్రధానమంత్రి అవుతానా అన్న ప్రశ్నలు అసంబద్దమైనవని అన్నారు. కాగా, మరో మూడు రోజుల తర్వాత ఫిక్కి సదస్సులో గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ ప్రసంగించనున్న సమయంలో రాహుల్ సిఐఐలో ప్రసంగించారు.