జగన్ పార్టీకి జాన్ రిజైన్: నన్నపనేని కూతురిపై పోరు
గుంటూ జిల్లాలోని వినుకొండ వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. శనివారం నన్నపనేని సుధకు వ్యతిరేకంగా బొల్లా బ్రహ్మనాయుడు వర్గీయులు ర్యాలీ నిర్వహించారు. వినుకొండ అసెంబ్లీ టికెట్ స్థానికులకే టికెట్ ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు. వినుకొండ నుంచి పోటీ చేయాలనే ఉద్దేశంతోనే నన్నపనేని సుధ వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరారు.
ఇదిలావుంటే, తూర్పు గోదావరి జిల్లాలో కూడా శనివారం అంతర్గత కుమ్ములాటలు రచ్చకెక్కాయి. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ రూరల్ నియోజకవర్గంలో విభేదాలు బయటపడ్డాయి. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నియోజకవర్గం కన్వీనర్ జాన్ ప్రభుకుమార్ పార్టీకి రాజీనామా చేశారు. ఆనయతో పాటు మరో 9 మంది కూడా పార్టీ రాజీనామా చేశారు.
తమ ప్రాంతానికి చెందని వేణుగోపాల కృష్ణకు టికెట్ ఎలా ఇస్తారని జాన్ ప్రభుకుమార్ అడిగారు. రెండు నెలల క్రితమే వేణుగోపాలకృష్ణ పార్టీలో చేరారని, డబ్బున్నవారికే పార్టీలో ప్రాధాన్యం ఇస్తున్నారని ఆయన విమర్సించారు. మొదటి నుంచి తాను పార్టీ కోసం పనిచేశానని, నియోజకవర్గం ఇంచార్జీ నియామకంపై తనను సంప్రదించలేదని ఆయన అన్నారు.