రాములమ్మకు, నేతలకి షాక్: కెసిఆర్ ఫేస్బుక్ కలకలం
ప్రస్తుతం తెరాసకు ఉన్న ఎమ్మెల్యేల్లో నలుగురి పేర్లు అందులో లేవు. దీంతో వచ్చే ఎన్నికల్లో నలుగురికి టిక్కెట్ హుళక్కేనా అనే కలకలం వ్యక్తమవుతోంది. సిర్పూర్ కాగజ్ నగర్, ఎల్లారెడ్డి, పరకాల, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యేల పేర్లు ఫేస్బుక్లో పెట్టిన లిస్టులే లేవు. మిగతా ఎమ్మెల్యేల పేర్లు అందులో ఉన్నాయి.
మెదక్ పార్లమెంటు సభ్యురాలు, పార్టీ సీనియర్ నేత విజయశాంతి పేరు కూడా లిస్టులో లేదు. ప్రస్తుతం తెరాసకు ఇద్దరి ఎంపీలు ఉన్నారు. కెసిఆర్, రాములమ్మలు ఉన్నారు. మెదక్ స్థానం కోసం ఇప్పటికే పోటా పోటీ నెలకొంది. ఈ నేపథ్యంలో కెసిఆర్ పేరుతో ఉన్న ఫేస్బుక్లో విజయశాంతి పేరు లేకపోవడం చర్చనీయాంశమైంది.
సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో నలుగురికి మినహా మిగతా వారికి టిక్కెట్లు ఇస్తున్నట్లుగా ఉంది. నలభై అసెంబ్లీ నియోజకవర్గాలకు, నాలుగు పార్లమెంటు నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేసినట్లుగా అందులో ఉంది. అయితే, రాములమ్మ సహా నలుగురు సిట్టింగుల పేర్లు లేకపోవడం కలకలం రేపుతున్నా ఇది కెసిఆర్ పేరుతో ఉన్న ఫేక్ ఫేస్బుక్ అని భావిస్తున్నారు.
తెరాస ఆగ్రహం
కెసిఆర్ పేరిట ఉన్న ఫేస్బుక్లో ఎన్నికల అభ్యర్థుల లిస్టును ఉంచడంపై తెరాస ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై తాము సిసిఎస్ పోలీసులకు ఫిర్యాదు చేస్తామని తెలిపింది. కెసిఆర్కు అసలు ఫేస్బుక్ ఖాతా లేదని, కావాలనే ఎవరో పార్టీని దెబ్బ తీయడానికి ఈ ప్రయత్నం చేశారని తెరాస పోలిట్బ్యూరో సభ్యుడు శ్రవణ్ అన్నారు. ఈ సంఘటనపై తాము సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేస్తామని ఆయన చెప్పారు.