డిఆర్సీ రగడ: కలుషిత నీటిని ప్రదర్శించిన జయసుధ
కలుషిత నీరు సరఫరా అవుతుంటే నెల పాటు ఒక లైనంతా సరఫరా నిలిపేస్తారని, ఆ సమయంలో ప్రజలు ట్యాంకర్ నీటిని కొనబోతే బకాయిలున్నారని నీటిని ఇవ్వడం లేదని ఎమ్మెల్యేలు అందరూ మండిపడ్డారు. బుధవారం పబ్లిక్ గార్డెన్లోని జూబ్లీహాల్లో జిల్లా సమీక్షా కమిటీ(డిఆర్సి) సమావేశం ఇన్చార్జి మంత్రి గీతా రెడ్డి అధ్యక్షతన జరిగింది.
దీనిలో మంత్రి దానం నాగేందర్, ఎంపీలు ఎంఏ ఖాన్, అసదుద్దీన్ ఒవైసీ, అంజన్కుమార్ యాదవ్, ఎమ్మెల్సీలు కె.నాగేశ్వర్, జాఫ్రి, రిజ్వీ, ప్రభాకర్, కాటేపల్లి జనార్దన్రెడ్డి, ఎమ్మెల్యేలు అక్బరుద్దీన్ ఒవైసీ, ముంతాజ్ఖాన్, విరాసత్ రసూల్ ఖాన్, అహ్మద్ పాషా ఖాద్రీ, జయసుధ, కిషన్ రెడ్డి, మోజంఖాన్, అఫ్సర్ఖాన్, అహ్మద్ బలాలలు పాల్గొన్నారు.
దాదాపు గంటన్నర పాటు నీటిపై వాడివేడి చర్చ జరిగింది. ప్రజాప్రతినిధులు నీటి సమస్యపై నిలదీశారు. సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో నీటి సరఫరాలో అసమానతలు పాటిస్తున్నారని ఎంపి అంజన్ కుమార్ యాదవ్ ఆరోపించారు. సరఫరాలో సమతుల్యం పాటించాలని, లగ్జరీ అవకాశాలు(లిక్కర్, కూల్డ్రింక్) రంగానికి నీటి సరఫరాను నిలిపివేయాలని పలువురు సూచించారు. వేసవిలో తాగునీటి ఎద్దడి నివారణకు సమ్మర్ యాక్షన్ ప్లాన్ ప్రకటించాలని, కృష్ణా మూడో దశను ప్రాజెక్టును చేపట్టాలని కోరారు.