బెయిలివ్వండి: మళ్లీ సుప్రీం కోర్టు గడప తొక్కిన జగన్
వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సిబిఐ) నాలుగు రోజుల క్రితమే ఐదో ఛార్జీషీట్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఇందులో జగన్తో పాటు హోంమంత్రి సబితా ఇంద్రా రెడ్డిని నాలుగో నిందితురాలిగా పేర్కొన్నారు. మంత్రి ధర్మాన ప్రసాద రావు పేరు వాన్ పిక్ ఛార్జీషీటులో నిందితుడిగా పేర్కొన్నారు. మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ ఇప్పటికే జైలులో ఉన్నారు.
జగన్ను గతేడాది మే 27న పోలీసులు అరెస్టు చేశారు. అప్పటి నుండి జగన్ బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటి వరకు బెయిల్ రాలేదు. గతేడాది జగన్ బెయిల్ కోసం సుప్రీం కోర్టులో దరఖాస్తు చేసుకున్నారు. అప్పుడు సుప్రీం కోర్టు 2013 మార్చి నెలాఖరు వరకు దర్యాఫ్తు పూర్తి చేసి తుది ఛార్జీషీటు దాఖలు చేయాలని సిబిఐని ఆదేశించింది. ఆ తర్వాత బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చునని జగన్కు సుప్రీం సూచించింది.
ఈ నేపథ్యంలో సిబిఐ దర్యాఫ్తును పూర్తి చేయనందున తనకు బెయిల్ ఇవ్వాలని జగన్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. మరోవైపు సుప్రీం కోర్టు తమకు ఎలాంటి డెడ్ లైన విధించలేదని సిబిఐ చెబుతోంది.