మంత్రులది బాధ్యతే: జెసి, సర్వే మాట కూడా అదే
పైళ్లపై సంతకాలు చేసినందుకు మంత్రులు బాధ్యత వహించాల్సిందేనని జెసి దివాకర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. వైయస్ రాజశేఖర రెడ్డి అడిగితే తాము సంతకాలు పెట్టామని అనడం సరి కాదని ఆయన అన్నారు. ఓ అంశం విషయంలో తాను మంత్రిగా ఉన్నప్పుడు సంతకం చేయకుండా తాను ముఖ్యమంత్రికే ఫైలు పంపించానని ఆయన గుర్తు చేశారు.
కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ కూడా దాదాపు అదే పద్ధతిలో మాట్లాడారు. ఆరోపణలు ఎదుర్కుంటున్న మంత్రులు రాజీనామా చేయాల్సిందేనని కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ అన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ఆస్తుల కేసులో సిబిఐ దాఖలు చేసిన చార్జిషీట్లలో నిందితులుగా ఉన్నంత మాత్రాన మంత్రులు దోషులు కారని ఆయన అన్నారు. రాజీనాలు చేసే విషయాన్ని ఆరోపణలు ఎదుర్కుంటున్న మంత్రులకే వదిలేస్తున్నట్లు ఆయన తెలిపారు.
సబితా ఇంద్రారెడ్డికి సెల్యూట్ ఎలా చేస్తారు..
సిపిఐ చార్జిషీట్లో ఏ4 నిందితురాలుగా ఉన్న సబితకు పోలీసులు సెల్యూట్ ఎలా చేస్తారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ ప్రశ్నించారు. శనివారం ఉదయం ఆయన గుంటూరులో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. అవినీతి మంత్రి సబితను వెంటనే బర్తరఫ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. విద్యుత్ సమస్యలపై పోరాటం చేస్తున్న విపక్షాలను కించపర్చేలా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్కు ప్రజలే బుద్ధి చెబుతారన్నారు.
రాజకీయ, ఆర్థిక నేరస్తుడు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ అని నారాయణ దుయ్యబట్టారు. జైల్లో ఉన్న అలాంటి వ్యక్తి వద్దకు వెళ్లి బి పారాలు అడుక్కునే స్థితకి రాజకీయాలు దిగజారడం సిగ్గుచేటు అని మండిపడ్డారు. జగన్ పార్టీలోకి వెళ్లిన వారికి ముందుంది ముసళ్ల పండుగ అని ఆయన వ్యాఖ్యానించారు.
ఈ ఉదయం తెనాలిలో ఈవిటీజర్ల చేతిలో మృతి చెందిన సునీల కుటుంబసభ్యులను నారాయణ పరామర్శించారు. ఈ ఘటనలో నిందితులకు ఎన్కౌంటరే సరైన శిక్ష అని ఆయన డిమాండ్ చేశారు.