మావోలకి దెబ్బ: అగ్రనేత రాజిరెడ్డి సహా 10మంది మృతి

బీజాపూర్ సమీపంలోని బాసగూడ పోలీసు స్టేషన్ పరిధిలో ఇది జరిగింది. 150 మంది మావోయిస్టుల బెటాలియన్ సమావేశం నిర్వహిస్తుందనే సమాచారం రావడంతో గ్రేహౌండ్స్, సిఆర్పీఎఫ్, ఖమ్మం జిల్లా పోలీసులు, ఛత్తీస్గఢ్ పోలీసులు విస్తృతంగా కూంబింగ్ నిర్వహించారు. ఈ సమయంలో మావోలు ఎదురు పడ్డారు.
దీంతో ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. టవర్తి, కుమ్మరితోపు వద్ద కాల్పులు కొనసాగుతున్నాయి. ఈ కాల్పుల్లో దాదాపు పదిమంది మావోలు మృతి చెందినట్లుగా సమాచారం. ఇందులో మావోల అగ్రనేత మల్లా రాజిరెడ్డి కూడా ఉన్నట్లుగా సమాచారం. పోలీసులు భారీగా ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకుంటున్నారు.
ఎన్కౌంటర్లో మృతి చెందినట్లుగా భావిస్తున్న రాజిరెడ్డిది కరీంనగర్ జిల్లాలోని మంథని మండలం శాస్త్రులపల్లి గ్రామం. ఆయన మంథని, మహదేవ్పూర్లకు నాయకత్వం వహించారు. ప్రస్తుతం అతను కేంద్ర కమిటీలోని ఐదుగురు వ్యక్తుల్లో ఒకరు. అందులోను రాజిరెడ్డి ముఖ్యుడు. అగ్రనేతలు గణపతి, మల్లోజుల, కిషన్జీ కంటే రాజిరెడ్డి సీనియర్. ఇతని వయస్సు 75 నుండి 80 వరకు ఉంటుంది.
2007లో అతను పోలీసులకు పట్టుబడ్డాడు. 2009 అక్టోబరులో బెయిల్ పైన విడుదలయ్యాడు. వెంటనే అతను అజ్ఞాతంలోకి వెళ్లాడు. అప్పుడే అతనిపై రూ.12 లక్షల రివార్డు ప్రకటించారు. 1975లో ఉద్యమ బాట పడ్డాడు. ఇంటర్ వరకు చదివిన రాజిరెడ్డి వ్యూహరచనలో నిపుణుడు.












Click it and Unblock the Notifications