జర్మన్ బేకరీ పేలుళ్లు: బేగ్ నేరస్తుడేనని తేల్చిన కోర్టు

ఈ నెల 18న శిక్షపై తీర్పు వెలువరించనున్నట్లు చెప్పారు. బేగ్ పక్కాగా ప్రణాళిక రచించి, దాడికి పాల్పడ్డాడని ఎన్నికైన ప్రభుత్వం పట్ల పౌరుల్లో ఉన్న నమ్మకాన్ని అస్థిరపరచడమే అతడి ఉద్దేశమన్న ప్రాసిక్యూషన్ వాదనతో జడ్జి ఏకీభవించారు. ఉద్గిర్లో సైబర్ కేఫ్ నడుపుతున్న బేగ్ను 2010 సెప్టెంబర్ 7న మహారాష్ట్ర ఎటిఎస్ పోలీసులు అరెస్టు చేశారు. మరో ఆరుగురితో కలిసి కోరేగావ్ పార్క్ ప్రాంతంలో ఉగ్రదాడికి కుట్రపన్నిపనట్లు అప్పట్లో అతడిపై ఆరోపణలొచ్చాయి.
జర్మన్ బేకరీ పేలుళ్ల కుట్రను 2008 మార్చిలో కొలంబోలో పన్నారు. అప్పట్లో అబు జుందాల్, ఫయ్యజ్ కజ్గీలతో కలిసి బేగ్ శ్రీలంక వెళ్లాడు. పాక్లో ఉగ్రవాద శిక్షణ పొందాలనుకుంటున్న ముస్లిం యువత ఖర్చుల కోసం అక్కడే బేగ్కు డబ్బు ఇచ్చారు. కొలంబో నుంచి తిరిగొచ్చిన తర్వాత బేగ్ ఉద్గిర్లో స్థిరపడి ఓ సైబర్కేఫ్ ప్రారంభించాడు. 25 ఈమెయిల్ ఐడీలతో అందరినీ సంప్రదించేవాడు. 2010 జనవరి 31న పుణె వెళ్లి, రెక్కీ చేశాడు.
యాసీన్ భత్కల్తో కలిసి ఫిబ్రవరి 13న బేకరీలోని ఓ టేబుల్ కింద బాంబు పెట్టాడు. ఈ కేసును ముందుగా పుణె పోలీసులు నమోదుచేసి, తర్వాత ఏటీఎస్కు బదిలీ చేశారు. ఐపిసి 302 (హత్య), 307 (హత్యాయత్నం), 435 (కాల్పులు లేదా పేలుడు పదార్థాలు ఉపయోగించడం), 474 (ఫోర్జరీ), 153 (ఎ) (జాతి, మతం, పుట్టిన ప్రదేశం, భాషా ప్రాతిపదికన వేర్వేరు వర్గాల మధ్య శతృత్వం రేపడం, మతసామరస్యాన్ని దెబ్బతీసే చర్యలకు పాల్పడటం), 120 (బి) (నేరపూరిత కుట్ర) సెక్షన్ల కింద బేగ్పై నేరాలు రుజువయ్యాయి. నేరం నిరూపితమైన ఏకైక వ్యక్తి బేగ్. ఇంకా యాసీన్ భత్కల్, మొహిసిన్ చౌదరి, రియాజ్ భత్కల్, ఇక్బాల్ భత్కల్, ఫయ్యజ్ కజ్గి పరారీలో ఉన్నారు. కాగా.. ఈ తీర్పుపై తాము హైకోర్టుకు వెళ్తామని బేగ్ తరపు న్యాయవాది తెలిపారు.












Click it and Unblock the Notifications