వైయస్సార్సీపిలోకి జయప్రద: 30న జగన్తో భేటీ?
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ రాంపూర్ పార్లమెంటు సభ్యురాలు జయప్రద వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరడం దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. ఆమె ఈ నెల 30వ తేదీన హైదరాబాదులోని చంచల్గుడా జైలులో వైయస్ జగన్మోహన్ రెడ్డిని కలిసే అవకాశం ఉంది. తనకు వచ్చే ఎన్నికల్లో రాజమండ్రి లోకసభ టికెట్ కావాలని జయప్రద అడుగుతున్నారు.
తన నియోజకవర్గం అయిన రాంపూర్లో పోలీసులు తనపై దౌర్జన్యం చేశారని జయప్రద ఆరోపించారు. తనను ఓ మహిళా ఎంపీ అని చూడకుండా పరుష పదజాలంతో దూషించారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. పార్లమెంటు సభ్యురాలైన తనకే రక్షణ లేదని, సామాన్యులకు ఏ విధమైన రక్షణ ఉంటుందని ఆమె అన్నారు.
తనపట్ల దురుసుగా ప్రవర్తించిన పోలీసులకు సస్పెండ్ చేయాలని కోరుతూ లోకసభ స్పీకర్ మీరా కుమార్కు ఫిర్యాదు చేసినట్టు జయప్రద తెలిపారు. ఎస్పీనేత ఆజంఖాన్ పోలీసులను తనపైకి ఉసిగొల్పుతున్నారని జయప్రద ఆరోపించారు. తన వాహనంపై ఎర్రబుగ్గను తొలగించిన ఆర్టిఎ అధికారిపై చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని తాను రాష్ట్రపతి, ప్రధాని దృష్టికి తీసుకుని వెళ్తానని ఆమె చెప్పారు.

సమాజ్వాదీ పార్టీ నుంచి ఆమె బహిష్కరణకు గురైన విషయం తెలిసిందే. అమర్ సింగ్కు మద్దతు తెలపడంతో జయప్రదపై ఎస్పీ వేటు వేసింది. అప్పటి నుంచి ఆమె ఆంధ్రప్రదేశ్ వైపు దృష్టి సారించారు. ఆమె తెలుగుదేశం పార్టీలో చేరుతారని తొలుత వార్తలు వచ్చాయి. అయితే, ఆమె వైయస్ జగన్ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications