ఇండియాటుడే పర్సనాలిటీస్: జగన్ ఫస్ట్, లిస్ట్లో కెసిఆర్
ప్రస్తుత రాజకీయాలతో పాటు బంగారం ధరలు పడిపోవడానికి గల కారణాలను ఇండియా టుడే తన తాజా సర్వేలో పేర్కొంది. బంగారం ధరలు పడిపోవడం వల్ల బంగారం వ్యాపారులు, బులిటన్ డీలర్స్ ఇతర వ్యాపారాలపై ఎలా పడిందని వివరించారు. ఇటీవలె జ్ఞానపీఠ్ పొందిన రావూరి భరద్వాజ గురించి రాశారు. విశాఖపట్నం సీటు తనదే అంటున్న రాజ్యసభ సభ్యుడు టి సుబ్బిరామి రెడ్డి, ఆ స్థానం నుండి ఎంపీగా గెలిచి కేంద్రమంత్రిగా ఉన్న దగ్గుపాటి పురంధేశ్వరితో పాటు కథానాయిక అంజలి అంశాలను పొందుపర్చారు.
అలాగే రాష్ట్రంలోని అత్యంత ప్రభావశీలురలంటూ పదిమంది పేర్లను పేర్కొంది. పలు అంశాలను పరిగణలోకి తీసుకొని వారి పేర్లను ప్రభావశీలురుగా పేర్కొంది. వైయస్ జగన్మోహన్ రెడ్డి, కె చంద్రశేఖర రావు, వి దినేష్ రెడ్డి, జివి ప్రసాద్, బివిఆర్ మోహన్ రెడ్డి, సి. పార్థసారథి, బుద్ధప్రసాద్, డాక్టర్ జి.సురేందర్ రావు, జి.మహేష్ బాబు, పి.గోపిచంద్లు ఈ వరుసలో ఉన్నారు.
గతేడాది అంటే 2012 మే 27వ తేది నుంచి జగన్ హైదరాబాద్ చంచల్గూడ జైలులో ఉన్నా రాష్ట్రంలో అధికార కాంగ్రెసు పార్టీకి బలమైన సవాలుదారుగా మారారని ఇండియా టుడే పత్రిక పేర్కొంది. గతంలో ఇండియా టుడే తన కథనంలో జగన్ జైల్లో ఉన్నా రాష్ట్ర రాజకీయాలతో పాటు, జాతీయ రాజకీయాల్లో కీలకమైన వ్యక్తి అవుతారని పేర్కొంది.