హైదరాబాదులో బాబు: ఎన్టీఆర్ను వదిలేశారని అంబటి
చంద్రబాబు వస్తుండటంతో భారీగా తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు, ప్రజలు శంషాబాద్ విమాశ్రయానికి చేరుకున్నారు. చంద్రబాబుకు ఘన స్వాగతం పలికారు. చంద్రబాబు ర్యాలీ విఐపి ద్వారం నుండి ప్రారంభమైంది. చంద్రబాబు వెంట హీరో బాలకృష్ణ, లోకేష్లు కూడా ఉన్నారు. బాబు, లోకేష్, బాలయ్యతో కరచాలనం చేసేందుకు కార్యకర్తలు, ప్రజలు ఉత్సాహపడ్డారు. వేలాది వాహనాలు ర్యాలీలో పాల్గొన్నాయి.
మందకృష్ణ మాదిగ యుద్ధ భేరీకి బాబు
శంషాబాద్ నుండి ర్యాలీగా బయలుదేరిన చంద్రబాబు రాజేంద్ర నగర్ బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అనంతరం మొహిదీపట్నం, లక్డీకాపూల్ నుండి ఎన్టీఆర్ ఘాట్కు చేరుకుని నివాళులు అర్పిస్తారు. అక్కడి నుండి పార్టీ కార్యాలయం.. అటు నుండి ఇంటికి చేరుకుంటారు. స్వల్ప విశ్రాంత అనంతరం ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో ఉప్పల్లో జరుగనున్న యుద్ద భేరీ కార్యక్రమానికి హాజరవుతారు.
పాదయాత్రకు మచ్చ తెచ్చారు.. అంబటి
చంద్రబాబు పాదయాత్ర పవిత్రతకు మచ్చ తెచ్చారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు విమర్శించారు. పాదయాత్ర ముగింపు సభలో చంద్రబాబు పసలేని ప్రసంగం చేశారని, ప్రసంగంలో తన తొమ్మిదేళ్ల పాలన మళ్లీ తెస్తానని ఎక్కడా చెప్పలేకపోయారన్నారు.
ముఖ్యమంత్రి పదవి కోసమే బాబు పాదయాత్ర చేపట్టారని, ఆయన పెద్ద మోసగాడన్నారు. ఆయనను సొంత తమ్ముడే నమ్మలేదని ఇక ప్రజలన ఎలా నమ్ముతారన్నారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు ప్రవేశ పెట్టిన రెండు రూపాయలకు కిలో బియ్యం పథకాన్ని, మద్య నిషేధాన్ని ఎత్తి వేశారని ధ్వజమెత్తారు.
అంపశయ్య మీద ఉన్న పార్టీని రక్షించుకునేందుకు బాబు పాదయాత్ర చేపట్టారన్నారు. 2009లో హీరో జూనియర్ ఎన్టీఆర్ను ప్రచారానికి వాడుకొని వదిలేశారన్నారు. బాబును ముఖ్యమంత్రిగా చూడాలని ఏ పౌరుడు కోరుకోవడం లేదన్నారు. రాష్ట్రంలో పార్టీ చచ్చిపోలేదని నిరూపించేందుకు అందరు నేతలను పిలిపించుకున్నారన్నారు.