సహాయం చేస్తానని బంధించి ఆర్నెల్లుగా లైంగిక వేధింపు
పోలీసుల వివరాల ప్రకారం... సిద్దిపేటలోని ఇందిరా నగర్లో ఉండే బాలిక(17) తల్లిదండ్రులు కొన్నేళ్ల క్రితం అనారోగ్యంతో చనిపోయారు. ముగ్గురు కూమార్తెల్లో చిన్నదైన సదరు బాలిక నానమ్మ వద్దే ఉండేది. పదో తరగతి వరకు చదివి ఒక బట్టల దుకాణంలో పని చేసేది.
సదాశివపేటకు చెందిన మల్లేశం(47) స్థానికంగా పండ్ల వ్యాపారం చేసేవాడు. అప్పట్లో వీరి ఇంటి పక్కనే అద్దెకు ఉండేవాడు. అతడి ఇంట్లో టివి చూడ్డానికి ఆ బాలిక వెళ్లేది. అలా మల్లేశం పరిచయమయ్యాడు. చదివిస్తానంటూ తిరిగి సదాశివపేటకు ఏడాది కిందట వెళ్లేటప్పుడు ఆ బాలికను తీసుకెళ్లాడు. గడిచిన ఆరు నెలల నుంచి గదిలో నిర్బంధించి లైంగిక దాడికి పాల్పడుతున్నాడు.
మల్లేశం నిజస్వరూపాన్ని ఆలస్యంగా గ్రహించిన బాధితురాలు ఎలాగోలా ఈ నెల 12న బయటపడి మహారాష్ట్రలోని నాందేడ్ సమీపంలో ఉండే తన బావ వద్దకు చేరింది. జరిగిన దారుణాన్ని వివరించింది. ఈ క్రమంలోనే అక్క, నానమ్మతో వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఉదంతంపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.