పుస్తకాల ద్వారా విజ్ఞానం: నరేంద్ర మోడీ చొరవ
అహ్మదాబాద్: పుస్తక పఠనాసక్తిని పెంచడానికి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ వినూత్నమైన పథకానికి శ్రీకారం చుట్టారు. పఠనానందాన్ని నలుగురికి పంచడానికి వీలుగా ఫ్లోటింగ్ బుక్స్ ప్రోగ్రామ్ పథకానికి ఆయన శ్రీకారం చుట్టారు. తాను అహ్మదాబాద్ ద్వితీ జాతీయ పుస్తక ప్రదర్శనను ప్రారంభించిన విషయాన్ని గుర్తు చేస్తూ పుస్తక పఠనం పట్ల యువతలో ఆసక్తిని పెంచడానికి తమ ప్రభుత్వం తీసుకున్న, తీసుకుంటున్న చర్యలను ఆయన తన బ్లాగ్లో రాశారు.
ఫ్లోటింగ్ బుక్స్ ప్రోగ్రామ్ ద్వారా ఓ పుస్తకాన్ని మిత్రులు ఒకరి తర్వాత ఒకరు చదవడానికి అందించుకుంటూ ఉంటారు. దీనివల్ల డబ్బులు ఆదా కావడమే కాకుండా పాఠకుల సంఖ్య పెరుగుతుందని మోడీ అభిప్రాయపడ్డారు. సామాజిక విజ్ఞానాన్ని గ్రంథ పఠనం ద్వారా పెంచడానికి వీలవుతుందని ఆయన అన్నారు. ఆహ్మదాబాద్ నగర పాలక సంస్థ నేషనల్ బుక్ ట్రస్ట్తో కలిసి గుజరాత్ సాహిత్య పరిషత్, గుజరాత్ ప్రకాషక్ మండల్ సహకారంతో పుస్తక ప్రదర్శనను ఏర్పాటు చేశాయి.

ఈ ఏడాది పుస్తక ప్రదర్శన భారీగా ఉందని ఆయన చెప్పారు. పుస్తకాలను విరాళంగా ఇవ్వడానికి ఓ ప్రత్యేకమైన కౌంటర్ ఏర్పాటు చేయడం ఈ పుస్తక ప్రదర్శన ప్రత్యేకత అని ఆయన అన్నారు. పుస్తక ప్రదర్శనకు వచ్చేవారు ఎవరైనా సరే, ఈ కౌంటర్ ద్వారా పుస్తకాన్ని విరాళంగా ఇవ్వవచ్చునని ఆయన చెప్పారు. సర్దార్ పటేల్పై గ్రంథాన్ని విరాళంగా ఇచ్చే గౌరవం తనకు దక్కిందని ఆయన అన్నారు.
పుస్తకాలు అందుబాటులో లేని వర్గాలకు, తక్కువ అందుబాటులో ఉన్న వర్గాలకు వాటిని అందించడానికి పుస్తక ప్రదర్శన ఉపయోగపడుతుందని అన్నారు. ఇది ప్రభుత్వ బడ్జెట్ కేటాయింపులకు, ప్రభుత్వ కార్యక్రమాలకు మించి పని చేస్తుందని, ఉమ్మడిగా ఏదో ఒకటి చేయడం సమాజంపై ప్రభావం చూపుతుందని, ఇది విలువలకు, సంస్కృతికి సంబందించిందని మోడీ అన్నారు.
పుస్తక ప్రదర్శనకు పెద్ద యెత్తున పిల్లలు రావడం సంతోషాన్నిచ్చిందని ఆయన అన్నారు. యువతలో పఠనాసక్తిని పెంచాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ఈ విషయంలో టెక్నాలజీ, ప్యాకేజింగ్ ఎంతో ఉపకరిస్తుందని అభిప్రాయపడ్డారు. మౌస్ను క్లిక్ చేయడం ద్వారా పుస్తకాన్ని పొందే దశకు మెల్లగా చేరుకుంటున్నామని మోడీ అన్నారు. యువత టాబ్లెట్ కంప్యూటర్ల ద్వారా ఇ - బుక్స్ చదివే వెసులుబాటు అందుబాటులోకి వస్తుందని అన్నారు. యువతలో పఠనాసక్తిని పెంచడానికి టెక్నాలజీని వాడుకోవాలని ఆయన సూచించారు.












Click it and Unblock the Notifications