సిబిఐ అఫిడవిట్: ప్రధాని కార్యాలయానికి స్పాట్
పీఎంవోను ఇరకాటంలో పెట్టే పేరును న్యాయశాఖ మంత్రి అశ్విన్ కుమార్ తొలగించారని సిబిఐ చెప్పింది. గనుల కేటాయింపులో నిబంధనలు పాటించలేదన్న సిబిఐ వాదనతో న్యాయశాఖ మంత్రి ఏకీభవించలేదు. ఏ మార్పులు చేసింది, ఏమేమి మార్చింది అనే వివరాల్ని సీల్డ్ కవర్లో సిబిఐ న్యాయస్థానానికి అందజేయనుంది. న్యాయశాఖ మంత్రి కార్యాలయంలో జరిగిన సమావేశంలో సిబిఐ అధికారులు, అటార్నీ జనరల్, అదనపు సొలిసిటర్ జనరల్ కూడా పాల్గొన్నారని అఫిడవిట్లో సిబిఐ తెలిపింది.
స్టేటస్ నివేదిక నుంచి నిందితుల పేర్లను తొలగించడం గానీ, చేర్చడం గానీ జరగలేదని సిన్హా చెప్పారు. ప్రక్రియలో అనుమానితులను గానీ నిందితులను గానీ వదిలేయలేదని స్పష్టం చేశారు. చాలా మార్పులు తమ కార్యాలయం అధికారులు మాత్రమే చేశారని, అయితే, ఎఎస్జి (రావల్)ను, అసిస్టింగ్ అడ్వొకేట్ లేదా న్యాయశాఖ మంత్రిని సంప్రదించి ఆ మార్పులు చేశారని ఆయన వివరించారు. ఈ దశలో మార్పులను ఎవరినో ఒకరిని వేలెత్తి చూపడం కష్టమని అన్నారు.
కాగా బొగ్గు బ్లాకుల కేటాయింపు కుంభకోణంలో విచారణ నిష్పక్షపాతంగా జరిగిందని సిబిఐ డైరెక్టర్ రంజిత్ సిన్హా ఆదివారం వెల్లడించారు. ఈ కేసులో నిందితులెవ్వరూ తప్పించుకోలేరని స్పష్టం చేశారు. గత నెల 12న జరిగిన విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు - నివేదిక వివరాలను ఎవరితోనూ పంచుకోలేదని సిబిఐ డైరెక్టర్ అఫిడవిట్ను దాఖలు చేయాలంటూ ఆదేశించిన సంగతి తెలిసిందే.