సిఎం రేసులో ఉన్నా, వారం పట్టొచ్చు: సిద్ధరామయ్య
విజయం సాధించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. అయితే ముఖ్యమంత్రి ఎవరనేది అధిష్టానం నిర్ణయిస్తుందని, ముఖ్యమంత్రి ఎంపికకు వారం రోజులకు పైగా పట్టవచ్చని ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, బిజెపి తప్పిదాలతో ప్రజలు విసిగిపోయారని ఆయన అన్నారు
కర్ణాటకలో గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ మంత్రం పని చేయలేదని, ఎన్నికల్లో ఎఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రభావం స్పష్టంగా కనిపించిందని సిద్దరామయ్య వ్యాఖ్యానించారు. సోనియా, రాహుల్ కృషి వల్లే రాష్ట్రంలో తమ పార్టీ ఘన విజయం సాధించిందని ఆయన అన్నారు.
కాగా, ముఖ్యమంత్రి అభ్యర్థిని తమ పార్టీ అధిష్టానం నిర్ణయిస్తుందని కాంగ్రెసు మరో సీనియర్ నేత మల్లికార్జున ఖార్గే అన్నారు. మల్లికార్జున ఖార్గే కూడా ముఖ్యమంత్రి పదవికి రేసులో ఉన్నారు. కేంద్ర మంత్రులు ఎస్ఎం కృష్ణ, వీరప్ప మొయిలీ కూడా ముఖ్యమంత్రి పదవికి రేసులో ఉన్నట్లు ప్రచారం సాగుతోంది.
కాంగ్రెస్ పార్టీ విజయపథాన సాగుతున్న సమయంలో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. కర్ణాటక కాంగ్రెసు కార్యాలయాల వద్ద కాంగ్రెసు కార్యకర్తలు సంబరాల్లో మునిగిపోయారు. ఢిల్లీలోని ఎఐసిసి కార్యాలయం వద్ద కూడా సంబరాలు జరుగతున్నాయి. హైదరాబాద్లోని గాంధీభవన్లో కూడా కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు సంబరాలు జరుపుకుంటున్నారు. కాంగ్రెసు నాయకులు ఆనందసముద్రంలో మునిగి తేలుతున్నారు.