చంద్రబాబుకు తలనొప్పి: కదలని తెలంగాణ నేతలు
తెరాసలో చేరడం లేదని చెప్పినప్పటికీ సుద్దాల దేవయ్య తెలుగుదేశం పార్టీలో చురుగ్గా వ్యవహరించడం లేదు. ఇటీవల మోత్కుపల్లి నర్సింహులుకు, కడియం శ్రీహరికి మధ్య తలెత్తిన విభేదాలు కూడా తెలంగాణలో పార్టీ నాయకుల తీరును పట్టిస్తోందని అంటున్నారు. పార్టీలోకి తిరిగి వచ్చిన టి. దేవేందర్ గౌడ్ను రాజ్యసభకు పంపించారు. దానిపై తలసాని శ్రీనివాస యాదవ్ వంటి నాయకులు అలిగినప్పటికీ చంద్రబాబు ఖాతరు చేయలేదు. అయితే, దేవేందర్ గౌడ్ అనుకున్నంత చురుగ్గా వ్యవహరించడం లేదు. ఆయన ఆరోగ్యం కూడా సహకరించడం లేదని అంటున్నారు.
నల్లగొండ జిల్లా భువనగిరి శానససభ్యురాలు ఉమా మాధవరెడ్డి కూడా ఎప్పుడో కానీ కనిపించడం లేదు. తెలుగుదేశం తెలంగాణ ఫోరం కన్వీనర్గా వ్యవహరిస్తున్న ఎర్రబెల్లి దయాకర్ రావు తన దూకుడును తగ్గించినట్లు కనిపిస్తున్నారు. తెరాసపై తీవ్రమైన దాడి చేస్తూ వచ్చిన దయాకర్ రావు ఇప్పుడు అంతగా ముందుకు రావడం లేదు. మోత్కుపల్లి నర్సింహులు మాత్రమే చురుగ్గా కనిపిస్తున్నారు.
తెలంగాణకు చెందిన చాలామంది శానససభ్యులు, నాయకులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తూ ఉండడం పట్ల చంద్రబాబు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు చెబుతున్నారు. తెలంగాణపై ఒక్క అడుగు ముందుకు వేసినప్పటికీ పార్టీని తెలంగాణలో బలోపేతం చేయడంలో పూర్తిగా విఫలమైనట్లు భావిస్తున్నారు. కాగా, ఈ నెలలో పార్టీ మహానాడు జరగనుంది. మహానాడుపై చంద్రబాబు గురువారం పార్టీ నాయకులతో చర్చించారు.
ఈ నెల 18 నుంచి 22వ తేదీ వరకు అన్ని జిల్లాల్లో, అన్ని నియోజకవర్గాల్లో మినీ మాహానాడు నిర్వహించాలని చంద్రబాబు పార్టీ నాయకుల సమావేశంలో నిర్ణయించారు. తద్వారా పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం నింపాలని ఆయన అనుకుంటున్నారు.