జగన్కు షాక్: బాబుపై దాడి!, గొంతు కలిపిన కొణతాల
గురువారం జగన్కు బెయిల్ రాలేదు. ఈ నేపథ్యంలో జూపూడి ప్రభాకర రావు, శ్రీకాంత్ రెడ్డి తదితరులు చంద్రబాబును టార్గెట్ చేశారు. చంద్రబాబు ఇటీవల రెండు రోజులు ఢిల్లీలో ఎందుకున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా జూపూడి ఢిల్లీలో మాట్లాడుతూ.. జగన్కు బెయిల్ రాకపోవడం బాధాకరమే అన్నారు. ఆయన అభిమానులు, పార్టీ కార్యకర్తలు బెయిల్ వస్తుందని ఆశపడ్డారని అన్నారు.
నాలుగు నెల్లలో తుది ఛార్జీషీటును దాఖలు చేయాలని సిబిఐకి కోర్టు ఆదేశాలు జారీ చేసిందన్నారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు ఇప్పటికే జగన్ పార్టీకి ఓటేసేందుకు నిర్ణయించుకున్నారని, జగన్ జైలులో ఉన్నంత మాత్రాన పార్టీ దెబ్బతినదన్నారు. జడ్జిమెంటుకు రెండు రోజుల ముందు బాబు ఢిల్లీలో ఎందుకున్నారో చెప్పాలన్నారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న మంత్రులు సాక్ష్యాలను తారుమారు చేయనప్పుడు జైల్లో ఉన్న జగన్ ఎలా చేస్తారో చెప్పాలన్నారు. తారుమారు పేరుతో జగన్కు బెయిల్ నిరాకరించారన్నారు.
సెప్టెంబర్ 9వ తేదిన మరోసారి బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తామన్నారు. సిబిఐ విచారణ పేరుతో కాలాయాపణ చేస్తోందన్నారు. సిబిఐ స్వయంప్రతిపత్తితో పని చేయడం లేదని సర్వోన్నత న్యాయస్థానమే చెప్పిందన్నారు. తమకు ఈ తీర్పు నిరాశను కలిగించిందన్నారు. సుప్రీం ఆదేశాలు పాటిస్తామన్నారు. సిబిఐ కోర్టులను తప్పుదోవ పట్టిస్తోందని, బొగ్గు కుంభకోణం కేసులో సిబిఐ పంజరంలోని చిలుకలా మారిందని సుప్రీం కోర్టు చెప్పిందని కొణతాల రామకృష్ణ అన్నారు.
చంద్రబాబు నాయుడు రెండు మూడు రోజులు ఢిల్లీలో ఎందుకున్నారో చెప్పాలని శ్రీకాంత్ రెడ్డి ప్రశ్నించారు. జగన్ సాక్ష్యులను ఎలా ప్రభావితం చేస్తారో చెప్పాలన్నారు. హోంమంత్రి సబితా ఇంద్రా రెడ్డి, మంత్రి ధర్మాన ప్రసాద రావు ప్రభావితం చేయనప్పుడు జగన్ ఒక్కరే చేస్తారా అన్నారు.