మరింత దూరం:4గురిపై వేటు, సురేఖపై జగన్ ఆగ్రహం!
అయితే, పరిణామాలు చూస్తుంటే మాత్రం ఆమె అసంతృప్తితో ఉన్నారని తెలుస్తోందంటున్నారు. అంతేకాదు ఆమె అసంతృప్తి పైన పార్టీ అధిష్టానం కూడా ఆగ్రహంతో ఉన్నట్లుగా కనిపిస్తోంది. వరంగల్ జిల్లాకు చెందిన నలుగురు ఇంఛార్జుల పైన పార్టీ అధిష్టానం సస్పెన్షన్ వేటు వేసింది. వారు నలుగురు కొండా సురేఖ వర్గానికి చెందన వారే కావడం గమనార్హం. జిల్లా మహిళా, మైనార్టీ, ట్రేడ్, ఎస్టీ ఇంఛార్జీ నేతలపై అధిష్టానం వేటు వేసింది.
కొండా సురేఖ వర్గానికి చెందిన వారిపై వేటు వేయడంతో ఆమె అసంతృప్తితో ఉన్నది నిజమేనని మరింత బలపడిందని, అదే సమయంలో ఆమె అసంతృప్తిని అధిష్టానం తేలిగ్గా తీసుకోవడమే కాకుండా కొండా దంపతులపై ఆగ్రహంతో ఉన్నట్లుగా అర్థమవుతోందని చెబుతున్నారు. కొండా సురేఖ అసంతృప్తి, ఆమె వర్గంపై వేటు నేపథ్యంలో ఆమె ఆ పార్టీకి ఎప్పుడైనా గుడ్ బై చెప్పే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయంటున్నారు.
మరోవైపు కొండా సురేఖ అసంతృప్తి నేపథ్యంలో ఆమెకు కాంగ్రెసు పార్టీ గాలం వేస్తున్నట్లుగా ప్రచారం సాగుతున్న విషయం తెలిసిందే. దివంగత వైయస్ రాజశేఖర రెడ్డికి కొండా దంపతులకు ఉన్న సాన్నిహిత్యం నేపథ్యంలో జగన్ పార్టీ పెట్టగానే కొండా సురేఖ కాంగ్రెసును వీడి, తన మంత్రి పదవికి రాజీనామా చేసి వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరారు. ఇటీవల కొత్తగా పార్టీలో చేరిన వారికి పదవులు ఇస్తూ తమను నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపిస్తూ కొండా వర్గం జిల్లా పార్టీ కార్యాలయానికి తాళం వేసింది. అప్పటి నుండి వివాదం మరింత ముదిరింది.