గిలానీ కుమారుడిని అపహరించిన సాయుధులు
సాయుధులు హైదర్ గిలానీ వ్యక్తిగత కార్యదర్శి మొహియుద్దీన్ను, గార్డును కాల్చి చంపినట్లు సమాచారం. సాయుధులు కాల్పులు జరుపుతూ హైదర్ గిలానీ వద్దకు చేరుకున్నట్లు తెలుస్తోంది. సాయుధుల కాల్పుల్లో ఐదుగురు గాయపడినట్లు సమాచారం. ముల్తాన్లో ఎన్నికల ప్రచారం చేయవద్దని మిలిటెంట్ గ్రూపులు ఇంతకు ముందు హెచ్చరించాయి. ఈ నెల 11వ తేదీన జరిగే సార్వత్రిక ఎన్నికల ప్రచారం గురువారంతో ముగుస్తోంది.
హైదర్ గిలానీ అపహరణపై అధికారికంగా ఇప్పటి వరకు ఏ విధమైన సమాచారం రాలేదు. ఆయనను అపహరించింది ఎవరనేది కూడా తెలియడం లేదు. ఏ గ్రూప్ కూడా ఇంతవరకు తాము అపహరించామనే విషయాన్ని ప్రకటించలేదు.
యూసుఫ్ రజా గిలానీ మరో కుమారుడు అలీ మూసా గిలానీ ఏడుస్తూ పార్టీ కార్యకర్తలను నియంత్రించడానికి ప్రయత్నిస్తున్న దృశ్యాలను టీవీ చానెళ్లు ప్రసారం చేశాయి. దుండగులు కారులో వచ్చి విచక్షణారహితంగా కాల్పులు జరుపుతూ హైదర్ గిలానీని చేరుకున్నట్లు చెబుతున్నారు. ఆయనను కారులో ఎక్కించుకుని కాల్పులు జరుపుతూ పారిపోయినట్లు సమాచారం.