సిద్ధరామయ్య ప్రమాణ స్వీకారంలో అపశృతి: ఒకరి మృతి
దాదాపు యాభై వేల మంది కార్యకర్తలు వచ్చినట్లుగా అంచనా వేస్తున్నారు. ప్రమాణ స్వీకార కార్యక్రమం పూర్తయ్యాక అందరు ఒక్కసారిగా బయటకు వచ్చే ప్రయత్నాలు చేశారు. ఈ స్టేడియంలో గేట్లు చిన్నగా ఉండటంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో నంజప్పతో సహా నలుగురు గాయపడ్డారు. నంజప్పను ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఇతను మృతి చెందాడు.
కాగా, కర్నాటక ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య సోమవారం ఉదయం ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. గవర్నర్ భరద్వాజ్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. రాష్ట్ర రాజధాని బెంగళూరులోని కంఠీరవ క్రీడా మైదానంలో ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో కాంగ్రెసు నేతలు, కార్యకర్తలు తరలి వచ్చారు.
సిద్ధరామయ్య 28వ ముఖ్యమంత్రిగా పదకొండు గంటల నలభై నిమిషాలకు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ఎస్ఎం కృష్ణ, అంబరీష్, కేంద్రమంత్రి మల్లికార్జున ఖర్గే, కెపిసిసి అధ్యక్షుడు పరమేశ్వర, మధుసూదన్ తదితరులు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ఏఐసిసి ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ కూడా హాజరయ్యారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో కాంగ్రెసు పార్టీ విజయం సాధించిన విషయం తెలిసిందే.