కెసిఆర్ లోగుట్టు: తెలంగాణ వస్తే సిఎం రేసులో కడియం?
తెలంగాణ వస్తుందనే ధీమాతోనే తెలంగాణ రాష్ట్రంలో తాము అమలు చేసే కార్యక్రమాలను, తాము అనుసరించే విధానాలను ఆయన వివరిస్తున్నారు. కడియం శ్రీహరిని పార్టీలోకి ఆహ్వానించిన తర్వాత కెసిఆర్ కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. కడియం మచ్చ లేని నాయకుడని, తనకు మంచి మిత్రుడని, తెలంగాణ రాష్ట్రంలో కడియం శ్రీహరి నిర్వహించే పాత్ర అత్యంత కీలకంగా ఉంటుందని ఆయన చెప్పారు.
కడియం శ్రీహరి ఎన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించారని ఆయన చెప్పారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కడియం శ్రీహరి చేపట్టే బాధ్యత అత్యంత ముఖ్యంగా ఉంటుందని, దాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోతారని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో తొలి ముఖ్యమంత్రి దళితుడేనని, కెసిఆర్ తలనైనా నరుక్కుంటాడు గానీ ఈ విషయంలో వెనక్కి తగ్గబోడని ఆయన అన్నారు. ఈ వ్యాఖ్యలను చూస్తుంటే కడియం శ్రీహరిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించడానికి ఆయన సిద్ధపడినట్లే కనిపించారు. కానీ, ప్రమాదాన్ని గ్రహించి బయటకు చెప్పలేదు గానీ చెప్పినంత పని చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో పది పదిహేను మంది నిర్వహించే కీలకమైన బాధ్యతల్లో కడియం శ్రీహరి కూడా ఉంటారని చెప్పారు. దీన్నిబట్టి కడియం శ్రీహరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ముఖ్యమంత్రి పదవికి రేసులో అగ్రభాగాన నిలిచే అవకాశం ఉంది. నిజానికి, కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు వివేక్ను ముఖ్యమంత్రి పదవి ఆశ చూపి కెసిఆర్ పార్టీలోకి ఆహ్వానించినట్లు గతంలో ఊహాగానాలు చెలరేగాయి. కానీ వివేక్ పార్టీలోకి రాలేదు. వస్తారో లేదో కూడా తెలియదు.
నిజానికి, దళిత వర్గానికి చెందిన కడియం శ్రీహరి రాజకీయ జీవితంలో ఆరోపణలు లేవు. అందరికీ తలలో నాలుక మాదిరిగానే వ్యవహరించారు. విధానాల విషయంలో కూడా రాజీ పడిన దాఖలాలు లేవు. తెలుగుదేశం పార్టీని వీడి తెరాసలోకి రావడం ఒక్కటే ఆయనపై విమర్శలకు కారణమవుతోంది. చాలా కాలం మంత్రిగా కూడా పనిచేశారు. తెలంగాణ రాష్ట్రం వస్తే తప్పకుండా కడియం శ్రీహరి రేసులో ఉంటారు గానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడడమే పెద్ద సందేహంగా ఉంది.