క్లాస్ పీకి కొండా సురేఖకు హామీ ఇవ్వని వైయస్ జగన్!
జగన్తో భేటీ అనంతరం కొండా దంపతులు చల్లబడినప్పటికీ వారికి అతని నుండి ఎలాంటి హామీ లభించలేదని చెబుతున్నారు. కేవలం ఇటీవల సస్పెన్షన్ వేటు వేసిన వారిని మాత్రం క్రమంగా దరి చేర్చుకుంటామని జగన్ చెప్పినట్లుగా తెలుస్తోంది. అంతకుముంచి వారికి వరంగల్ జిల్లాలో ఆధిపత్యం పైన మాత్రం హామీ ఇవ్వలేదని సమాచారం. తమకు ప్రాధాన్యత ఉండటం లేదని భావించిన కొండా సురేఖ కొంతకాలంగా అసంతృప్తితో ఉన్నారు.
ఇటీవల కొండా వర్గానికి చెందిన నలుగురు నాయకులు వరంగల్ జిల్లా పార్టీ కార్యాలయానికి తాళం వేశారు. వీటిని కొండా దంపతులు కొట్టిపారేస్తున్నారు. జగన్ను కలిసిన వారు ఎన్నో హామీలు ఇప్పించుకోవాలని భావించారట. కానీ తీరా భేటీ అయ్యాక జగన్ నుండి ఎలాంటి హామీ లభించలేదట. జిల్లా కార్యాలయానికి తాళం వేసిన నలుగురి పైన సస్పెన్షన్ వేటును క్రమంగా తొలగిస్తామని మాత్రం జగన్ చెప్పారట. పైగా వారికి పెద్ద క్లాస్ పీకారట.
మీరు ఇలా చేస్తారని తాను అనుకోలేదని, తోబుట్టువులా చూసుకుంటే ఇతర పార్టీలలో చేరుతానని లీకులు ఇవ్వడమేమిటని, ఇలాంటి పరిస్థితుల్లో ఇలాగేనా వ్యవహరించేదని వారిని జగన్ ప్రశ్నించారట. పార్టీలోనే కాకుండా అధికారంలోకి వస్తే మీ ప్రాధాన్యత మీకు ఉంటుందని చెప్పారట. జగన్ క్లాస్తో వెనక్కి తగ్గిన కొండా దంపతులు జిల్లా ఆధిపత్యంపై ఎలాంటి హామీ లేకుండానే బయటకు వచ్చి పార్టీని వీడమని చెప్పారని అంటున్నారు.