సమస్యల వలయం: ఊరట కోసం ఫ్లైటెక్కనున్న కిరణ్
అలాగే పార్టీని వీడుతామని ప్రకటించిన తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యుల వ్యవహారం, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి వర్గం విమర్శలు, కర్నాటక ఎన్నికల విజయం ఏ మేరకు, ఎలా ఎపి రాజకీయాలపై పడుతుందనే తదితర అంశాలపై చర్చించే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. కర్నాటక ఎన్నికలు పూర్తవగానే ఆయన ఢిల్లీ వెళ్తారనే ప్రచారం జరిగింది. అయితే, కేంద్రంలోని పరిస్థితుల దృష్ట్యా కిరణ్ ఢిల్లీ పర్యటన వాయిదా పడి ఈరోజు వెళ్లనున్నట్లుగా తెలుస్తోంది.
కేంద్రంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులు వరుసగా రాజీనామాలు చేస్తున్నారు. ఎపిలో మాత్రం అందుకు భిన్నంగా ఉంది. ఇది సొంత పార్టీ నేతల నుండే విమర్శలకు తావిస్తోంది. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సబితా ఇంద్రారెడ్డి, ధర్మాన ప్రసాద రావులను మంత్రివర్గం నుండి తొలగించాలని సొంత పార్టీ నేతలే డిమాండ్ చేస్తున్నారు.
దీనిపై అధిష్టానంతో చర్చించి ఓ నిర్ణయానికి వచ్చేందుకు కిరణ్ ప్రయత్నాలు చేయనున్నారు. మరోవైపు అసంతృప్తి వర్గం వరుస భేటీలను ఆయన అధిష్టానానికి ఫిర్యాదు చేయనున్నారు. బొత్స సత్యనారాయణ జోడు పదవుల అంశం కూడా కిరణ్ భేటీలో చర్చకు వచ్చే అవకాశాలున్నట్లుగా తెలుస్తోంది. కిరణ్ తమ ముందుకు తెచ్చే సమస్యలను తక్షణమే అధిష్టానం పరిష్కరించి ఆయనకు ఊరటనిస్తూందా అనేది తేలిపోనుంది.