సోహ్రబుద్దీన్ ఎన్కౌంటర్: ఇద్దరు ఎపి పోలీస్లపై ఛార్జీషీట్
కటారియాతో పాటు ఆర్కె మార్బుల్ సంస్థ డైరెక్టర్ విమల్ పాట్నీ, ఆంధ్రప్రదేశ్కు చెందిన నరసింహ బాలసుబ్రహ్మణ్యం, మరో పోలీసు అధికారి జి.శ్రీనివాసరావులను కూడా నిందితులుగా చేర్చింది. హైదరాబాద్ నుంచి సోహ్రాబుద్దీన్, ఆయన భార్య కౌసర్ బీలను గుజరాత్ యాంటీ టెర్రరిస్టు స్క్వాడ్ పోలీసులు కిడ్నాప్ చేసి ఎన్కౌంటర్ పేరుతో కాల్చి చంపేందుకు మన రాష్ట్ర పోలీసులు సహకరించారని సిబిఐ తన చార్జిషీటులో ఆరోపించింది.
సోహ్రాబుద్దీన్ చిన్నపాటి నేరస్తుడని, విమల్ పాట్నీ అనే వ్యాపారి నుంచి రూ.24 కోట్లు డిమాండ్ చేశారని సిబిఐ తెలిపింది. పాట్నీ, గుజరాత్ మాజీ హోం మంత్రి అమిత్ షాల మధ్య కటారియా సంధానకర్తగా పనిచేశారని సిబిఐ ఆరోపించింది. సోహ్రాబుద్దీన్, ఆయన భార్యను హత్యచేయించడంలో షా ప్రధానపాత్ర పోషించారని తెలిపారు.
ఆయన గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీకి సన్నిహితుడని పేర్కొంది. కటారియా, పాట్నీలతో పాటు జూన్ 4న కోర్టుకు హాజరు కావాలని సిబిఐ కోర్టు రాష్ట్ర పోలీసు అధికారులకు సమన్లు జారీ చేసింది. వీరిపై హత్య, అక్రమ నిర్బంధం, కిడ్నాప్ తదితర నేరాల కింద్ సిబిఐ అభియోగాలు మోపింది.