ఢిల్లీలో కిరణ్ రెడ్డి బిజీ: అధిష్టానం పెద్దలతో భేటీలు

పార్టీని, ప్రభుత్వాన్ని వచ్చే ఎన్నికలను ఎదుర్కోవడానికి వీలుగా తీర్చిదిద్దడానికి తీసుకోవాల్సిన చర్యలపై ఎక్కువగా చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. గురువారం ఉదయం ముఖ్యమంత్రి కిరణ్ రెడ్డి దాదాపు రెండు గంటల పాటు గులాం నబీ ఆజాద్తో సమావేశమయ్యారు. కళంకిత మంత్రులపై తీసుకోవాల్సిన చర్యలపై, నామినేటెడ్ పోస్టుల భర్తీపై ప్రధానంగా చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ఆస్తుల కేసులో ఇరుక్కున్న మంత్రులకు ఉద్వాసన పలికే దిశగా అధిష్టానం ముఖ్యమంత్రికి ఆదేశాలు ఇస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది.
ఈ నెల 22వ తేదీన కాంగ్రెసు విస్తృత స్థాయి సమావేశం జరిగే అవకాశాలున్నాయి. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని అధిష్టానం నుంచి సూచనలు అందినట్లు తెలుస్తోంది. పిసిసి కమిటీలను వేయడం, జిల్లా కమిటీల ఏర్పాటు వంటి అంశాలపై కూడా చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. మండలస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ఉన్నట్లు తెలుస్తోంది. గురువారం సాయంత్రం బొత్స, కిరణ్ రెడ్డి ఆజాద్తో సమావేశమయ్యారు.
కాగా, కళంకిత మంత్రులపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెసు సీనియర్ నేత వి. హనుమంతరావు వంటివారు అభిప్రాయపడుతున్నారు. హనుమంతరావు కిరణ్ కుమార్ రెడ్డిని కలిశారు. సోనియాకు తెలియకుండా తాను ఏమీ చేయబోనని కిరణ్ కుమార్ రెడ్డి చెప్పినట్లు ఆయన మీడియా ప్రతినిధులతో చెప్పారు. మంత్రులు తప్పు చేయలేదని కిరణ్ రెడ్డి భావిస్తున్నట్లున్నారని ఆయన అన్నారు.
సోనియా వద్ద కిరణ్ కుమార్ రెడ్డి ఏం చెబుతాడో, సోనియా ఏం అంటారో తెలిసిన తర్వాత మాట్లాడితే బాగుంటుందని ఆయన అన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి పార్టీ పని మీద వచ్చారా, పార్టీ పని మీద వచ్చారా అనేది తెలియనది ఆయన అన్నారు. లోపల కిరణ్ కుమార్ రెడ్డి ఏం మాట్లాడారో కూడా తనకు తెలియదని ఆయన అన్నారు.
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కేంద్ర విద్యుత్తు శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాను కలిశారు. కెజి బేసిన్లో వచ్చే గ్యాస్ను, థర్మల్ విద్యుత్తు ప్లాంట్లకు బొగ్గును కేటాయించాలని కిరణ్ కుమార్ రెడ్డి కోరినట్లు జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు. ఈ అంశం పరిశీలనలో ఉందని ఆయన చెప్పారు. మంత్రుల బృందం ఆమోదం తెలిపిన వెంటనే నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఎన్టీపిసి విద్యుత్తు ప్లాంట్లకు అధిక బొగ్గును ఇవ్వాలనన్న విజ్ఞప్తిని పరిశీలిస్తామని ఆయన చెప్పారు. సదరన్ గ్రిడ్ను వచ్చే ఏడాది జాతీయ గ్రిడ్తో అనుసంధానం చేస్తామని చెప్పారు. ఇప్పటికే రాష్ట్రానికి అదనంగా 395 మెగావాట్ల విద్యుత్తును కేటాయించామని చెప్పారు. కిరణ్ కుమార్ రెడ్డి కేంద్ర మంత్రి వీరప్ప మొయిలీని కూడా కలిశారు.












Click it and Unblock the Notifications